‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ తమ్ముడు. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు నటి లయ. ‘తమ్ముడు’ సినిమా జూలై 4న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్తో పాటు ఝాన్సీ కిరణ్మయి క్యారెక్టర్ లో నటించిన లయ మాట్లాడుతూ “తమ్ముడు మూవీలో ఝాన్సీ కిరణ్మయి అనే క్యారెక్టర్ లో నటించాను. తను ఒక ఆఫీసర్. స్ట్రిక్ట్గా ఉంటుంది. కుటుంబాన్ని చూసుకుంటూనే, ఆఫీసర్ గా నా బాధ్యతలు నిర్వర్తిస్తుంటాను. హీరో నితిన్ కు సోదరి పాత్ర నాది. ఈ చిత్రం కోసం అడవిలో షూటింగ్ చేశాం. రోజూ యూనిట్ లో ఎవరో ఒకరికి గాయాలు అయ్యేవి. షూటింగ్ పిక్నిక్ లా చేశామని చెబుతుంటారు. కానీ మేము పిక్నిక్ లా చేయలేదు. కష్టపడాల్సి వచ్చింది. మూవీ బాగా వస్తుందనే సంతోషంలో అంతా కలిసి పనిచేశాం. నితిన్తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. తను స్టార్ హీరో అయినా చిన్న పిల్లాడిలా మా అందరితో కలిసిపోయారు. నటనా పరంగా చూస్తే ఈ సినిమాలో నితిన్ చాలా పరిణతిగా కనిపిస్తాడు. చాలా కష్టమైన సీన్స్ కూడా సులభంగా చేశాడు. తమ్ముడు అనే టైటిల్ ఈ సినిమాకు సరిపోయింది. పవన్ కల్యాణ్ తమ్ముడు మూవీకి ఈ చిత్రానికి పోలిక లేదు. ఇక డైరెక్టర్ శ్రీరామ్ వేణు సెట్లో చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. నేను డబ్బింగ్ చెప్పినంత వరకు మూవీ కంటెంట్ చూశాను. సినిమా చాలా బాగా వచ్చింది. నా కెరీర్లో ఇప్పటిదాకా ఒక సాధారణ అమ్మాయి పాత్రల్లోనే నటించాను. తమ్ముడు మూవీలో మాత్రం బలమైన మహిళగా నటించే అవకాశం దక్కింది. ఈ కథలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. అక్కా తమ్ముడు సెంటిమెంట్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక ప్రస్తుతం శివాజీతో ఒక సినిమా చేస్తున్నాను” అని అన్నారు.