డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత, ఆయన విధానాలు ఐక్యరాజ్యసమితి (యుఎన్) దాని భద్రతా మండలి, ఇతర సంస్థలు గణనీయంగా బలహీనడినాయి. ఉక్రెయిన్- రష్యా యుద్ధం, ఇజ్రాయెల్ -గాజా (పాలస్తీనా) సంఘర్షణలు మానవ హక్కుల ఉల్లంఘనలు, మానవ జాతి హననం వైపు దారితీస్తున్నాయి. ఈ యుద్ధాలు అమెరికా నుండి ప్రత్యక్ష, పరోక్ష ఆర్థిక, ఆయుధ సహాయంతో సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి. ప్రపంచంలో ఉగ్రవాదులకు నిలయాలుగా ఉన్న పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్ మొదలైన దేశాల్లో వారిని పెంచి పోషించింది అమెరికానే. వారికి ఆర్థిక సహాయం చేసింది, ఆయుధాలు సమకూర్చిందీ, సైనిక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించిందీ అమెరికానే. ఈ సంఘర్షణలలో వేలాది సైనికులు, సామాన్య పౌరులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు మరణిస్తున్నారు.
గాజాలో ప్రజలు ఆకలి మంటలతో అల్లాడుతున్నారు, గాయాలతో సతమతమవుతున్నారు. ఇజ్రాయెల్ బాంబులతో వైమానిక దాడులు, అక్కడ ప్రజలకు తాగటానికి నీరు, తినటానికి ఆహారం, గాయాలకు, రోగాలకు ఔషధాలు అందకుండా చేస్తుంది. వారికి నిలువనీడ లేకుండాపోయింది. ప్రాణభయంతో వృద్ధులు, స్త్రీలు, పిసిపిల్లలతో పడుతూ, లేస్తూ పరుగులు పెడుతున్నారు. స్కూళ్లు, వైద్యశాలలు, ప్రార్థనా మందిరాలు ఇజ్రాయెల్ బాంబులతో ధ్వంసమయ్యాయి. ఈ ఇజ్రాయెల్ క్రూరత్వం వెనుక అండదండలు అందించేది అమెరికానే. ప్రపంచ దేశాలు మానవత్వం మరచి ఈ రెండు దేశాలను ఎదిరించలేక చేతులుకట్టుకుని, చేవచచ్చి చోద్యం చూస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి, ఇతర సభ్యదేశాల నుండి వచ్చే వైద్య సహాయాన్ని, ఆహారాన్ని ఇజ్రాయెల్ సైన్యం రాక్షసత్వం తో అడ్డుకుంటోంది. ఈ పరిస్థితులు ప్రపంచ శాంతి, స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్నాయి. ట్రంప్ రెండవ పర్యాయంలో అమెరికా ఐక్యరాజ్యసమితి నుండి దూరమై, దాని నిధులను గణనీయంగా తగ్గించింది.
2025 ఫిబ్రవరిలో ట్రంప్ పరిపాలన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యుఎన్హెచ్ఆర్సి) నుండి ఉపసంహరించుకుని, పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీ (యుఎన్ఆర్డబ్ల్యుఎ) నిధులను నిలిపివేసింది. అమెరికా, ఐక్యరాజ్యసమితి (United Nations) బడ్జెట్లో దాదాపు 25 శాతం వాటాను సమకూర్చే ప్రధాన దాతగా, ఈ నిధుల కోతలు యుఎన్ మానవతా కార్యక్రమాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఉదాహరణకు, యుఎన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ మయన్మార్లో సహాయాన్ని తగ్గించవలసి వచ్చింది. భద్రతా మండలిలో అమెరికా వీటో అధికారాన్ని ఉపయోగించి, గాజాలో మానవతా కోణంలో యుద్ధ విరామం కోసం ఉద్దేశించిన ప్రతిపాదనలను అడ్డుకుంది. 2023 అక్టోబర్లో బ్రెజిల్ ప్రతిపాదించిన ఒక తీర్మానం, గాజాలో మానవతా సహాయానికి అవసరమైన విరామం కోసం పిలుపునిచ్చినప్పటికీ అమెరికా వీటో కారణంగా విఫలమైంది. ఈ చర్యలు ఐక్యరాష్ట్రాల సంస్థ శాంతి స్థాపన లక్ష్యాలను అమలు చేయడంలో విఫలమవడానికి దోహదపడ్డాయి. ఇప్పుడు అమెరికా నిధులు మంజూరు చేయకపోవడంతో ఐక్యరాజ్యసమితి నిర్వీర్యం అయింది.
ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు ఏకగ్రీవంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై యుద్ధం పేరుతో పసిబిడ్డలతో సహా మానవ మారణకాండను కొనసాగిస్తున్నందుకు అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయినా తన వీటో పవర్తో అడ్డుకుంటుంది. ఉక్రెయిన్- రష్యా యుద్ధంలో ట్రంప్ పరిపాలన ఉక్రెయిన్కు సైనిక సహాయాన్ని నిలిపివేసి రష్యాతో శాంతి చర్చలను ప్రోత్సహించింది. 2025 ఫిబ్రవరిలో అమెరికా రష్యాతో రియాద్లో చర్చలు జరిపింది, ఉక్రెయిన్ను ప్రక్కన పెట్టి. ఈ చర్యలు ఉక్రెయిన్ భూభాగ సార్వభౌమత్వాన్ని రాజీచేసే అవకాశం ఉందని విమర్శలు వచ్చాయి. యుద్ధం కారణంగా ఐరోపాలో రక్షణ ఖర్చులు పెరిగాయి. నాటో భవిష్యత్తు అనిశ్చితంగా మారింది. ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక స్థిరత్వాన్ని, శక్తి సరఫరాను, ఆహార భద్రతను దెబ్బతీసింది. గాజా సంఘర్షణలో, ట్రంప్ విధానాలు ఇజ్రాయెల్కు అనుకూలంగా, పాలస్తీనియన్లకు వ్యతిరేకంగా ఉన్నాయి.
2025 ఫిబ్రవరిలో, ట్రంప్ గాజాను ‘మధ్యధరా రివియెరా’గా మార్చడానికి పాలస్తీనియన్లను ఈజిప్ట్, జోర్డాన్కు బలవంతంగా తరలించాలని ప్రతిపాదించాడు. దీనిని ఐక్యరాజ్యసమితి సంస్థ జాతి శుద్ధీకరణగా ఖండించింది. ఈ ప్రతిపాదన అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే కాక, ఈజిప్ట్, జోర్డాన్తో ఇజ్రాయెల్ శాంతి ఒప్పందాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. గాజాలో 47,552మంది పౌరులు మరణించారు. 111,629 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ కక్షకట్టి బాంబు దాడులు చేస్తూనే ఉంది, ఎవరు హితబోధ చేసినా వినే పరిస్థితిలో లేదు. ఈ యుద్ధాలు పర్యావరణ విధ్వంసాన్ని కలిగించాయి. గాజాలో 69 శాతం భవనాలు ధ్వంసమయ్యాయి. 92 శాతం గృహాలు, 88 శాతం పాఠశాలలు నాశనమయ్యాయి.
బాంబు దాడులు, అలాగే ఇంధన వినియోగం వాయు కాలుష్యాన్ని పెంచాయి. ఉక్రెయిన్ యుద్ధం శక్తి సరఫరా గొలుసులను అడ్డుకుంది, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని పెంచింది, ఇది వాతావరణ మార్పులను తీవ్రతరం చేసింది. ట్రంప్ విధానాలు ఐక్యరాష్ట్రాల సంస్థను బలహీనపరిచి, ప్రపంచ శాంతి, స్థిరత్వాన్ని దెబ్బతీశాయి. అమెరికా ఏకపక్ష చర్యలు, నిధుల కోతలు, ఇజ్రాయెల్కు అనుకూల వైఖరి సంఘర్షణలను మరింత తీవ్రతరం చేశాయి. ఐక్యరాష్ట్రాల సంస్థ ఆదర్శాలు, లక్ష్యాలు అమలుకు నోచుకోవడం లేదు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి, సభ్యదేశాలు సమష్టిగా బాధ్యత తీసుకొని, అంతర్జాతీయ చట్టాలను గౌరవించే విధంగా శాంతి చర్చలను ప్రోత్సహించాలి. ప్రపంచ శాంతికోసం ఐక్యరాష్ట్రాల సంస్థ బలోపేతం కావాలి. లేకపోతే మానవతా సంక్షోభాలు మరింత తీవ్రమవుతాయి.
- డా. కోలాహలం రామ్ కిశోర్
9849328496