ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చేయూతతో రాష్ట్ర వ్యవసాయరంగాన్ని ఆధునికీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా గురువారం నెదర్లాండ్ దేశానికి చెందిన ఆరిక్వట్(ఎఆర్ఐక్యూటి) కంపెనీ ప్రతినిధులతో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా రైతులకు ఒకేసారి సమాచారాన్ని అందించడం, రైతుల ఫిర్యాదులకు ఏఐ ఆధారంగా తక్షణ సూచనలు, సలహాలు ఇవ్వడం వంటి సేవలు అందించగలమని తెలిపారు.
సీజనల్ గా పంటలకు వచ్చే చీడపీడలను మొబైల్ ఫోన్ కెమెరా ద్వారా స్కాన్ చేసి గుర్తించే టెక్నాలజీని తెలంగాణ రాష్ట్రంతో భాగస్వామ్యంగా తీసుకురావడానికి తాము ఆసక్తిగా ఉన్నట్లు వారు వెల్లడించారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ నెదర్లాండ్ కంపెనీ ప్రతినిధుల సూచనలు పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. ఏఐ సాంకేతికతను వెరిఫై చేసిన తర్వాత ప్రభుత్వ పథకాలలో ఏవిధంగా వాటిని సమర్థవంతంగా వినియోగించవచ్చనే అంశంపై అధ్యయనం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి సూచించారు. సమావేశంలో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.