Wednesday, June 18, 2025

అహ్మదాబాద్ టు లండన్.. ఎయిరిండియా విమానంలో సమస్య

- Advertisement -
- Advertisement -

దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియాలో జరుగుతున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అహ్మదాబాద్‌లో ఎయిరిండియా బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానం లండన్ వెళ్తుండగా అహ్మదాబాద్‌లో కూలిపోయిన సంఘటన మరువక ముందే మరికొన్ని విమానాల్లో సాంకేతిక లోపాలు బయటపడ్డాయి. తాజాగా అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన మరో విమానం లోనూ సాంకేతిక సమస్య ఎదురైంది. టేకాఫ్‌కు ముందే సమస్యను గుర్తించడంతో ఈ సర్వీసును రద్దు చేశారు. ఎయిరిండియా ఏఐ 159 బోయింగ్ 7878 డ్రీమ్‌లైనర్ విమానం మంగళవారం మధ్యాహ్నం 1.10 గంటలకు అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరాల్సి ఉంది. ఈ క్రమం లోనే విమానంలో తనిఖీలు చేస్తుండగా, సాంకేతిక సమస్యను గుర్తించారు. దీంతో టేకాఫ్ నిలిపివేసి సర్వీసును రద్దు చేశారు. గత వారం నాటి విమాన ప్రమాదం తర్వాత లండన్‌కు వెళ్లాల్సిన తొలి షెడ్యూల్ విమానం ఇదే అకావడం గమనార్హం.

అయితే సాంకేతిక సమస్య వార్తలను ఎయిరిండియా తోసిపుచ్చింది. విమానం అందుబాటులో లేకపోవడం వల్లే సర్వీసును రద్దు చేసినట్టు తెలిపింది. “ గగనతల ఆంక్షలు, అదనపు ముందు జాగ్రత్త తనిఖీలు తదితర కారణాలతో ఆ విమానం అందుబాటులో లేదు. అందువల్లే అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే సర్వీసును రద్దు చేశాం. అంతేగానీ సాంకేతిక సమస్య వల్ల కాదు ” అని ఎయిరిండియా ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసింది. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది. టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే పూర్తి రీఫండ్ ఇస్తామని పేర్కొంది. ఈ ఉదయం శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ముంబై వెళ్తున్న ఏఐ 180 విమానంలో సమస్య రావడంతో దాన్ని కోల్‌కతాలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులను దించేసి తనిఖీలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News