ముంబయి: మహారాష్ట్రలోని ముంబయి నుంచి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. ముంబయి నుండి చెన్నై వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ఎఐ 639 క్యాబిన్లో ఏదో కాలిపోతున్నట్లు వాసన రావడంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. విమానాన్ని తిరిగి ముంబై విమానాశ్రయంలో ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పైలట్ సమయస్ఫూర్తితో విమానం ల్యాండ్ చేశాడని ప్రయాణికులు ప్రశంసించారు. ప్రయాణికులను మరో విమానంలో చెన్నైకు తరలించనున్నారు.
ముంబయి నుంచి చెన్నైకు వెళ్తున్న విమానంలోని కాక్ పిట్ నుంచి వాసన రావడంతో అత్యవసరంగా ల్యాండ్ చేశామని ఎయిరిండియా ప్రతినిధి తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరో విమానంలో తరలిస్తున్నామని పేర్కొన్నారు. ప్రయాణికుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని వివరణ ఇచ్చారు. ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 270 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మరణించిన వారి డిఎన్ఎ పరీక్షలు ఎట్టకేలకు పూర్తయ్యాయి. దీంతో విమాన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 260గా అధికారికంగా లెక్కతేల్చారు.