ఎయిరిండియా బోయింగ్ విమాన ప్రమాదంలో ఇప్పటివరకూ 190 మంది మృతదేహాలను గుర్తించారు. డిఎన్ఎ పరీక్షల ద్వారా వీరిని గుర్తించి వీటిలో 159 అవశేషాలను వారి వారి సమీప బంధువులకు అప్పగించారని అధికారులు బుధవారం తెలిపారు. మృతదేహాల అప్పగింత ప్రక్రియలో 32 మంది విదేశీయుల మృతదేహాల అవశేషాలు కూడా ఉన్నాయి. ఈ నెల 12వ తేదీన అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లే ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురయింది. భారీ స్థాయి మంటల్లో పలువురి మృతదేహాలు గుర్తుపట్టేందుకు వీల్లేకుండా మారాయి. దీనితో విస్తృతస్థాయిలో డిఎన్ఎ పరీక్షల అవసరం ఏర్పడింది.
సమీపంలోని మెడికల్ కాలేజీ క్యాంటిన్ భవనాలపై విమానం కుప్పకూలింది. అందులోని దాదాపు 29 మంది కూడా దుర్మరణం చెందారు. ఈ ఘటనలో ఒక్క ఒక్కడు ప్రాణాలతో బయటపడ్డాడు. కొందరి భౌతిక కాయాలను సాధారణ ప్రక్రియలోనే గుర్తించి వారి సమీపబంధువులకు అప్పగించారు. చాలా విస్తృత స్థాయి డిఎన్ఎ ప్రక్రియ కావడంతో మృతదేహాల అవశేషాల గుర్తింపు లో జాప్యం ఏర్పడింది. మృతులలో మరికొందరి అవశేషాల గుర్తింపు ప్రక్రియ మిగిలి ఉంది. ఇది కూడా పూర్తి చేసి బంధువులకు అప్పగించడం పూర్తి చేస్తామని అహ్మదాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరిటెండెంట్ డాక్టర్ రాకేష్ జోషి విలేకరులకు తెలిపారు. మిగిలిన ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు వివరించారు.