భారత్ జోడో యాత్ర సందర్భంగా భారతీయ సైనికులను కించపరచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని అలహాబాద్ హైకోర్టు బుధవారం నాడు మెత్తగా మందలించింది. 2022లో భారత్ జోడో యాత్ర సందర్భంగా భారత సైన్యం పరువు కు భంగం కలిగించే విధంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి లక్నో కోర్టు జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్ ను తిరస్కరిస్తూ, అలహాబాద్ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 19కింద వాక్ స్వాతంత్రం, భావ ప్రకటనా స్వేచ్ఛకు హామీ ఇస్తుంది.అయితే ఆ స్వేచ్ఛకూ కాస్త పరిమితి ఉంటుంది. భారత సైన్యానికి పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేసే స్వేచ్ఛ అందులో లేదని కోర్టు స్పష్టం చేసింది.2022లో రాజస్థాన్ లో మీడియా సమావేశంలో రాహుల్ ప్రసంగిస్తూ, అరుణాచల్ ప్రదేశ్ లో భారత సైనికులను చైనా దళాలు దెబ్బతీస్తున్నాయని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపైనే ఆయనపై పరువునష్టం దావా వేశారు.భారత్ జోడో యాత్ర గురించి ప్రజలు అడుగుతారని, కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు, గెహ్లోల్, సచిన్ పైలెట్ గురించి, అడుగుతారని, చైనా 2వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించిందని,
20 మంది భారతసైనికులను చంపిందని, అరుణాచల్ ప్రదేశ్ లో చైనా సైనికులు భారత సైనికులను దెబ్బతీశారని ఈ విషయాలపై ఒక ప్రశ్నకూడా అడగరని, భారతీయ పత్రికలు దీనిని ప్రశ్నించవని రాహుల్ గాంధీ అప్పట్లో మీడియా సమావేశంలో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్ లో రాహుల్ పై పరువునష్టం కేసు దాఖలైంది. కింది కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. దీంతో రాహుల్ అలహాబాద్ హైకోర్టు ను ఆశ్రయించి, విచారణను, సమన్లను రద్దుచేయాలని కోరారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బిఆర్ ఓ) మాజీ డైరెక్టర్ ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ ఈ పరువునష్టం కేసు దాఖలు చేశారు. అరుణాచల్ ప్రదేశ్ లై చైనా సైన్యం మన సైనికులను దెబ్బతీస్తోందని రాహుల్ గాంధీ పదేపదే చాలా అవమానకరమైన రీతిలో పేర్కొన్నారని ఆయన తెలిపారు. రాహుల్ తన పిటిషన్ లో ఫిర్యాదు చేసినవ్యక్తి భారత సైన్యానికి చెందిన అధికారి కాదని, అందువల్ల బాధితుడు కాదని వాదించారు. అయితే ఆ వాదనను కోర్టు తోసిపుచ్చింది. అతడు కల్నల్ హోదాతో సమానమైన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ రిటైర్డ్ డైరెక్టర్ కాబట్టి, అతడు ఈ నేరం వల్ల బాధపడిన వ్యక్తి అని కోర్టు అభిప్రాయపడింది.