Sunday, June 1, 2025

ఇప్పట్లో పాక్ కోలుకోవడం కష్టమే : అమిత్‌ షా

- Advertisement -
- Advertisement -

ఇటీవల చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ లోని 118 పోస్టులను, వారి సమాచార నిఘా నెట్‌వర్క్‌ను భారత సరిహద్దు భద్రతా దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా శుక్రవారం ప్రశంసలు కురిపించారు. బీఎస్‌ఎఫ్ కొట్టిన దెబ్బకు శత్రుదేశం కోలుకునేందుకు ఏళ్లు పట్టే అవకాశం ఉందన్నారు. “ ఉగ్రవాద స్థావరాలే లక్షంగా మనం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు ప్రతిస్పందనగా పాకిస్థాన్ సైన్యం మన సరిహద్దులోని పౌరులపై దాడులు చేసింది. వీటిని మన బీఎస్‌ఎఫ్ దళాలు దీటుగా తిప్పికొట్టాయి. దాదాపు 118 పాక్‌పోస్టులను ధ్వంసం చేశాయి.శత్రువుల నిఘా వ్యవస్థను ఒక్కొక్కటిగా కూల్చి వేశాయి. వాటిని పునరుద్ధరించేందుకు శత్రువులకు దాదాపు నాలుగు నుంచి ఐదేళ్లు పడుతుంది ” అని అమిత్‌ షా పేర్కొన్నారు. బీఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ నుంచి తనకు అందించిన సమాచారం ప్రకారం… పాక్ సైనిక సమాచార, నిఘా వ్యవస్థలకు భారీ దెబ్బ తగిలిందన్నారు.

కొంతకాలం పూర్తి సమాచార ఆధారిత యుద్ధాన్ని చేసే పరిస్థితిలో వారు లేరన్నారు. ఈ సందర్భంగా బీఎస్‌ఎఫ్ సంసిద్ధతపై అమిత్‌ షా ప్రశంసలు కురిపించారు. అప్రమత్తంగా ఉంటూ స్పష్టమైన వ్యూహాలను విజయవంతంగా అమలు చేశారని కొనియాడారు. భారత సరిహద్దులో ఎటువంటి దాడులు జరిగినా మొదట ఆ భారాన్ని మోసేది బిఎస్‌ఎఫ్ జవాన్లేనని అన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా జమ్ముకశ్మీర్‌లో అమిత్‌ షా పర్యటించారు. జమ్ముకశ్మీర్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా.. ఇటీవల పాకిస్థాన్ జరిపిన దాడుల సందర్భంగా నష్టపోయిన కుటుంబాలను అమిత్‌ షా పరామర్శించారు. పాక్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్లు, వ్యాపార కేంద్రాలు, ప్రార్థనా మందిరాలకు సంబంధించిన పరిహార ప్యాకేజిని కేంద్రం త్వరలో ప్రకటిస్తుందన్నారు. జమ్ము రీజియన్‌లో శాంతిభద్రతల పరిస్థితిని , అమర్‌నాథ్ యాత్ర సన్నాహాలను సమీక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News