జిల్లా కేంద్రంలో పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ఈ నెల 29న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభిస్తారని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ తెలిపారు. సోమవారం బిజెపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించాక పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసే రైతు సమ్మేళనంలో రైతులను ఉద్దేశించి కేంద్ర మంత్రి మాట్లాడతారని అన్నారు. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభంతో ఇందూరు ప్రజల చిరకాల వాంఛ నెరవేరనుందని పేర్కొన్నారు. ఇకనుంచి రైతుల నూతన శకం మొదలవుతుందని అభిప్రాయపడ్డారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన రైతులందరూ పెద్ద ఎత్తున రైతు సమ్మేళనానికి రావాలని కోరారు.
29న ధర్మపురి శ్రీనివాస్ విగ్రహావిష్కరణ
ఈ నెల 29న పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆవిష్కరిస్తారని ఎంపి అర్వింద్ తెలిపారు. డిఎస్ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ పటేల్ విగ్రహ రూపశిల్పి రామ్వీ సూతార్ తయారు చేశారని తెలిపారు.
జిల్లాకు మంత్రి పదవి లేకపోవడం దురదృష్టకరం
రాజకీయంగా చాలా ప్రాముఖ్యత గల జిల్లా, చాలా ఉద్యమాలకు ఊపిరిపోసిన నిజామాబాద్ జిల్లాకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం దురదృష్టకరం అని ఎంపి అర్వింద్ వ్యాఖ్యానించారు. జిల్లాలోని కాంగ్రెస్ ఎంఎల్ఎలో ఒక్కరు కూడా మంత్రి పదవికి సరిపోరని ఎద్దేవా చేశారు. ఇక కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణలో రాజకీయ జీవితం లేదని వ్యాఖ్యానించారు. ఆ కుటుంబంలోని కెసిఆర్పై కాళేశ్వరం అవినీతి ఆరోపణలు, బిడ్డ కవిత లిక్కర్ స్కాం, కొడుకు కెటిఆర్ ఈ కారు రేస్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నారని ధ్వజమెత్తారు. సిఎం రేవంత్ రెడ్డి వీరిని జైలుకు పంపితే మరిన్ని స్కాంలు బయట పడతాయని అన్నారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలని కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలను కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, అర్బన్ ఎంఎల్ఎ ధన్పాల్ సూర్యనారాయణ, బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, స్రవంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.