హైదరాబాద్: సాధారణంగా ఏదైనా కార్యక్రమం జరుగుతుందంటే.. దాన్ని నిర్వహించడంలో యాంకర్ కీలక పాత్ర పోషిస్తారు. కార్యక్రమానికి హాజరైన వాళ్లు ఎవరు నొప్పించుకోకుండా.. కార్యక్రమం సజావుగా సాగేలా చూసుకొనే బాధ్యత యాంకర్ది. కానీ, ఇటీవల ఓ సీనియర్ చేసిన పనికి ఆమెపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆమె మరెవరో కాదు.. యాంకర్ ఝాన్సీ. సీత (షి ఈజ్ ది హీరో ఆల్వేస్-SITHA) కార్యక్రమానికి ఝాన్సీ యాంకర్గా వ్యవహరించారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి శ్రీధర్ బాబుకు ఆమె వల్ల చేధు అనుభవం ఎదురైంది.
మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆయన మైక్ ఆఫ్ అయింది. కొంతసేపు ఏ జరుగుతుందో.. ఆయనకు అర్థం కాలేదు. వెంటనే ఝాన్సీ వచ్చి మంత్రికి క్షమాపణ చెప్పి.. నటి శ్రీలీలను వేదిక పైకి ఆహ్వానించారు. అంటే శ్రీలీల కోసం తన ప్రసంగాన్ని అడ్డగించారని శ్రీధర్ బాబుకు అర్థమైంది. దీంతో ఆయన సైలంట్గా ఉన్నారు. శ్రీలీల వేదిక మీదకు వచ్చిన వెంటనే ఆయన నవ్వుతూ పలకరించారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఒక హీరోయిన్ కోసం సభా మర్యాదను పాటించకుండా.. ఓ మంత్రి స్పీచ్ని అడ్డుకుంటారా?’ అంటూ యాంకర్ ఝాన్సీపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.