Tuesday, June 3, 2025

సరిహద్దు ప్రజలకు కేంద్రం భరోసా

- Advertisement -
- Advertisement -

పాకిస్తాన్ ఇటీవల జరిపిన దాడులతో జమ్మూకశ్మీర్‌లో ముఖ్యంగా పూంచ్ జిల్లాలోని ఇళ్లు, దుకాణాలు, ప్రార్థనా మందిరాలు తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ధ్వంసమైన ఈ నివాసాలను పునరుద్ధరించుకోడానికి కేంద్రం త్వరలో పరిహార ప్యాకేజీని ప్రకటిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం ప్రకటించడం సరిహద్దు నివాసాల ప్రజల్లో ఆశాకిరణం ఉదయించింది. పుంచ్‌లోని బాధిత కుటుంబాలను శుక్రవారం (మే 30) ఆయన పరామర్శించారు. పాక్ ఎలాంటి దాడులు చేసినా సరిహద్దుల్లోని ప్రజలే మొదట గురవుతున్నారన్న విషయాన్ని కేంద్రమంత్రి అమిత్ షా సరిగ్గానే గుర్తించారు. సరిహద్దు వెంబడి గత పదేళ్లలో ఇప్పటిదాకా 9500కు పైగా బంకర్లు నిర్మించామని, పాక్‌తో సంఘర్షణల సమయంలో మూడు రోజులపాటు స్థానికులకు రక్షణ కల్పించడంలో ఇవి కీలకపాత్ర పోషించాయన్నారు.

సరిహద్దుల్లో నివసించే ప్రజలకు ( people living in borders) పాక్ దాడులనుంచి రక్షణ కోసం అండర్‌గ్రౌండ్ షెల్టర్లు భారీ స్థాయిలో నిర్మించడానికి కేంద్రం యోచిస్తోంది. జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఈ నష్టాలను అంచనా వేసే ప్రక్రియలో ఉంది. పూంచ్ జిల్లాకు జరిగిన కష్టనష్టాలపై బిజెపి నియమించిన కమిటీ హోం మంత్రిత్వశాఖకు ప్రాథమిక నివేదిక సమర్పించింది. పాక్ బాంబుల దాడికి పూంచ్‌లో 690, యురిలో 534 మొత్తం 1500 ఇళ్లు ధ్వంసం అయ్యాయని, మొత్తం 18 మంది ప్రాణాలు కోల్పోగా, ఒక్క పూంచ్‌లోనే 14 మంది మృతి చెందారని నివేదికలో పేర్కొంది. పూంచ్, బారాముల్లా, కుప్వారా, రాజౌరీ ప్రాంతాల్లోని పట్టణాలపై పాక్ బాంబుల దాడులు జరిగాయి. పౌరుల కనీస మౌలిక సౌకర్యాలు బాగా దెబ్బతిన్నాయి. శుక్రవారం అమిత్ షా ఈ బాధిత ప్రాంతాలన్నీ పర్యటించి ప్రజలకు సంఘీభావం తెలిపారు. మృతుల కుటుంబాలకు చెందిన వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు.

అంతకు ముందు లోక్‌సభ విపక్ష నాయకుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధులు బాధితులను పరామర్శించారు. ఈ విధంగా ప్రభుత్వంనుంచి, విపక్షాలనుంచి ప్రతినిధులు వచ్చి భరోసా ఇవ్వడంతో కొంతవరకు తమకు నిబ్బరం కలిగినట్టు సరిహద్దులోని ప్రజలు భావిస్తున్నారు. అలాగే భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు ఎలాంటి గడువు తేదీ లేదని భారత్ ఆర్మీ ప్రకటించడం మరింత నిబ్బరం కలిగించింది. పాక్ బాంబు దాడులకు చెల్లాచెదురైన సరిహద్దులోని ప్రజలు తమ నివాసాలకు తిరిగి క్రమంగా చేరుకొంటున్నారు. జీవితాలు సాధారణ స్థితికి వస్తున్నాయి. బాధిత కుటుంబాల డిమాండ్లను నెరవేర్చడానికి జమ్మూకశ్మీర్ ప్రభుత్వం సతమతమవుతోంది. పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 1.2 లక్షల వంతున సహాయం అందించడానికి ప్రయత్నిస్తోంది.

అయితే ధ్వంసమైన తమ కాంక్రీట్, బహుళ అంతస్తుల భవనాలను తిరిగి నిర్మించుకోడానికి ఈ మొత్తం ఏమాత్రం సరిపోదని బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఆందోళన నెలకొన్న సమయంలో అమిత్ షా రిలీఫ్ ప్యాకేజీ విషయంలో ఇచ్చిన హామీ బాధితులకు ఆశాకిరణంలా కనిపించింది. మొత్తం 9500 బంకర్లలో జమ్మూ డివిజన్‌లో 8000, కశ్మీర్ వ్యాలీలో 1500లను కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు నిర్మించడం గమనార్హం. అయితే ముఖ్యంగా కశ్మీర్ లోయలో చాలా తక్కువగా ఉన్న జనావాస ప్రాంతాల్లో అకస్మాత్తుగా పాక్ బాంబుల దాడి జరిగితే తక్షణం సురక్షిత స్థావరాలకు చేరుకోవడానికి వీలుగా వ్యక్తిగత బంకర్లు నిర్మించాలన్న డిమాండ్ బాగా వినిపిస్తోంది. పహల్గాంలో పాక్ వత్తాసుతో ఉగ్రవాదుల దాడి జరిగిన తరువాత ఆపరేషన్ సిందూర్‌తో భారత్ బలగాలు గట్టిగానే దాయాదికి బుద్ధి చెప్పాయి. అయితే దీంతో నిబ్బరం పనికిరాదు.

పాకిస్తాన్‌కు అన్నివిధాలా అండదండలు అందించడానికి చైనా సంసిద్ధమవుతోంది. అయిదోతరం స్టెల్త్ ఫైటర్ జెట్లను నలభై వరకు చైనా పాకిస్తాన్‌కు అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు బంగ్లాదేశ్ కూడా చైనా సాయం కోరుతోంది. సరిహద్దుల్లో పొంచి ఉన్న ఈ ముప్పును బలంగా ఎదుర్కోవడానికి భారత్ నిరంతరం అప్రమత్తం కావలసిన సమయం ఏర్పడింది. రణవ్యూహాలే కాదు, దానికి తగిన అత్యంత ఆధునిక ఆయుధాలను సమకూర్చుకోవడంలో వెనుకబడరాదు. అత్యాధునిక యుద్ధవిమానాలు మనకు తగినంత లేనందున వాయుసేన పోరాటంపై ఆమేరకు ప్రభావం చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆయుధాల ఒప్పందాలు కుదిరి ఏళ్లు గడుస్తున్నా సమయానికి ఆయుధాలు సరఫరా కావడం లేదని సాక్షాత్తు ఎయిర్ చీఫ్ మార్షల్ (ఎసిసీఎం) అమర్ ప్రీత్ సింగ్ ఇటీవల కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలోనే ఆందోళన వ్యక్తం చేశారంటే రక్షణ ఆయుధాల సంపత్తిలో మనం ఏ స్థితిలో ఉన్నామో ఆలోచించాల్సిందే.

ఉదాహరణకు తేజస్ ఫైటర్ జెట్ల కోసం 1984 లోనే సన్నాహాలు జరిగితే, 2016 నాటికి వాయుసేనకు తొలిసారి తేజస్ సమకూరింది. ఇజ్రాయెల్, అమెరికా దేశాలు తమ దేశాల భద్రతకు గగనతలం లోనే ఇనుప గోడలు కట్టుకుంటున్న చర్యలను గమనించాలి. చైనా, పాకిస్థాన్ దేశాల బారినుంచి మనం రక్షించుకోవాలంటే మన వైమానిక దళంలో కనీసం 42 స్కాడ్రన్లు ఉండాలని రక్షణ రంగ అధికార యంత్రాంగా అంచనాగా సూచిస్తోంది. ఒక్కో స్కాడ్రన్‌లో 18 వరకు యుద్ధ విమానాలు ఉంటాయి. ఇప్పుడు మనకు 31 స్కాడ్రన్లే అందుబాటులో ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుత అవసరాలకు తగినట్టు ఆయుధాల సమీకరణలో ప్రభుత్వం జాప్యం లేకుండా ముందుచూపుతో వ్యవహరించడం అవసరం .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News