అహ్మదాబాద్లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా ప్రతీ పౌరుడిని విషాదంలో ముంచెత్తింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మినహా విమానంలో ఉన్న అందరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం నుంచి బయటపడిన మృత్యుంజయుడు విశ్వాస్కుమార్ రమేశ్ (Vishwaskumar Ramesh). విమానంలో 11ఎ సీటులో కూర్చున్న విశ్వాస్.. విమాన ప్రమాదం నుంచి అదృష్టం కొద్ది బయటపడ్డాడు. ప్రమాదం అనంతరం ఆయన నడుచుకుంటూ అంబులెన్స్ ఎక్కిన దృశ్యాలు సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా విశ్వాస్ ప్రమాదం నుంచి బయటపడిన మరో వీడియో సోషల్మీడియాలో చక్కర్లు కొడుతోంది.
విమానం బిజె మెడికల్ కాలేజీ హాస్టల్పై కూలగానే స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొందరు ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం అందించారు. అదే సమయంలో తెలుపు రంగు టీ-షర్టు ధరించిన వ్యక్తి చేతిలో సెల్ఫోన్ పట్టుకొని ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి నడుచుకుంటూ రావడం గమనించారు. అయన్ను చూసి తొలుత షాక్ అయిన స్థానికులు.. ఆ తర్వాత అతను ప్రమాదం నుంచి బయటపడినట్లు గుర్తించారు. అతని శరీరంపై గాయాలు చూసి అక్కడి నుంచి తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఘటనా స్థలం నుంచి విశ్వాస్ కుమార్ (Vishwaskumar Ramesh) నడుచుకుంటూ రావడం.. ఆయన వెనక విమానం కాలిపోయిన దృశ్యాలు ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో చూసిన నెటిజన్లు విశ్వాస్ కుమార్ నిజంగా మృత్యుంజయుడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.