సరిహద్దుల్లో అక్రమ చొరబాటుదారుల బారినుంచి తమను తాము రక్షించుకోవడానికి స్థానిక పౌరులకు ఆయుధాలు అందించడానికి అసోం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత ప్రమాదకరం, వివాదాస్పదంగా తయారైంది. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని అసోం రాష్ట్ర ప్రభుత్వం మారుమూల, దుర్బల ప్రాంతాల్లోని స్థానిక పౌరులు స్వయం సమాజాలకు ఆయుధాల వినియోగానికి లైసెన్సులు జారీ చేయడానికి నిర్ణయించింది. బంగ్లాదేశ్ను ఆనుకుని ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో నివసించే స్వదేశీ సమాజాలు దుర్బలంగా ఉన్నాయని అందువల్ల వారికి ఆయుధాల వినియోగానికి లైసెన్సులు మంజూరు చేస్తే వారికి వ్యక్తిగత భద్రత సమకూరడమే కాక, వారిలో మనోధైర్యం పెరుగుతుందని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెబుతున్నారు. అసోంలోని అంతర్రాష్ట్ర సరిహద్దు సమీపాన గల ప్రజలకు మాత్రం ఈ విధంగా ఆయుధాల లైసెన్సులు జారీ చేయడం జరగదని స్పష్టం చేస్తున్నారు. నిర్దిష్టమైన పౌరసమాజాలకు సాయుధ లైసెన్సులు అందిస్తే విపరీతంగా దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందన్న వాస్తవాన్ని అసోం ప్రభుత్వం తెలుసుకోవడం లేదు.
చట్టపరమైన అధికారానికి, ఆయుధాల వినియోగంపై గుత్తాధిపత్యానికి మధ్య ఉన్న రేఖ చెరిగిపోతుంది. స్థానికులు ఎవరో, స్థానికేతరులెవరో ఎంపిక చేయడం చాలా కష్టం. స్థానికేతరులను మినహాయించి, స్థానికులకే ఆయుధాల లైసెన్సులు అందిస్తే ఒకరిపై ఒకరికి నిఘా, పౌరసమాజాల మధ్య శత్రుత్వం పెరిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ప్రవేశించే వలసదారుల ఏరివేత ప్రభుత్వ చర్యలను మరింత సంక్లిష్టం చేస్తుంది. ప్రైవేట్ వ్యక్తులు గందరగోళంలో పడతారు. ఉల్ఫా వంటి తిరుగుబాటు గ్రూపుల ఆందోళనలు, హింసాత్మక సంఘటనలతో నిత్యం సతమతమయ్యే అసోం రాష్ట్రంలో పౌరుల చేతుల్లోకి ఆయుధాలను విశేషంగా అందిస్తే మరింత హింస పెరుగుతుందే తప్ప తగ్గదు. ఆత్మరక్షణకోసం అని చెప్పుకుంటున్నా వ్యక్తిగత భద్రత పేరుతో ఆయుధాల వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది. అక్రమ ఆయుధ ప్రైవేట్ మార్కెట్కు ద్వారాలు తెరుస్తాయి.
ఇది ఒక విధంగా పౌరులను రక్షించవలసిన ప్రధాన బాధ్యత నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకున్నట్టు అవుతుంది. దుర్బల ప్రాంతాల్లో ప్రభుత్వం తన చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి, భద్రతా ఉనికిని పెంచుకోవడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యామ్నాయం. ఆధునిక రాష్ట్రాల్లో హింసాత్మక సాధనాలపై, ఆయుధాలపై గుత్తాధిపత్యం ప్రభుత్వానికి, అది అమలు చేసే సంస్థల వద్దనే ఉంటుందని అందరికీ తెలుసు. భారతదేశంలో ఆయుధాల లైసెన్సులు నిబంధనల ప్రకారం అత్యంత అవసరం కలిగిన వారికి మాత్రమే జారీ అవుతాయి. ఆయుధ చట్టం 1959, ఆయుధ నిబంధనలు 2016 ప్రకారం వ్యక్తుల స్వీయ రక్షణకు ఆయుధాలను(Weapons defense) అందించడానికి కఠినతరమైన లైసెన్సింగ్ ప్రక్రియ అమలులో ఉంది. ఈ మేరకు వ్యక్తులను గుర్తించడం ఎంతో రిస్కుతో కూడుకున్నది. చట్టం ప్రకారం తుపాకీలకు లైసెన్సులు ఇవ్వడం, పర్యవేక్షించడం, తిరిగి వాటిని పొందడం ప్రభుత్వానికి కష్టతరం చేస్తాయి. చివరకు తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి ఆయుధాలు వెళ్లే ప్రమాదం ఎదురవుతుంది.
అసోంలో స్థానిక ప్రజలు అనేక మంది కనీస వసతులు కరువై బతుకుతున్నారు. వీరికి ఆయుధాలను కొనుగోలు చేసే స్తోమత లేదు. సంపన్నులు మాత్రమే వీటిని కొనుగోలు చేయగలరు. అలాగే ఆయుధాల వినియోగంలో శిక్షణ పొందడం, అందులో నైపుణ్యం సాధిస్తేనే స్వీయ రక్షణకు ఆయుధాలను వినియోగించ గలుగుతారు. అసోం రాష్ట్ర ప్రభుత్వం పౌరులకు తుపాకీలు అందిస్తే ఏవైనా ఉద్రిక్తతలు పెరిగినప్పుడు ప్రభుత్వంతో పనిలేకుండా తూటాలతోనే జనం జవాబివ్వడం జరుగుతుంది. గతంలో కూడా 1985 నుంచీ అసోంలో ఆయా ప్రాంతాల వారు తుపాకీ లైసెన్సుల కోసం డిమాండ్ చేస్తున్నా గత ప్రభుత్వాలు సాహసించలేదు. ఇది రాజ్యాంగ విరుద్ధమే కాక హింస పెరుగుతుందనే భయంతో ఈ విషయాన్ని పట్టించుకోలేదు. అందువల్లనే చాలా మంది స్థానిక తెగల వారు స్థానికేతరుల ఒత్తిడి వల్ల ఒత్తిళ్లకు లొంగి భూములు అమ్ముకోవలసి వచ్చిందని అసోం ముఖ్యమంత్రి హిమంత శర్మ ఆరోపించడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి.
దేశంలో పౌరులకు ఆయుధాల లైసెన్సులు జారీ చేయడం అన్నది మొట్టమొదటిసారి కాదు. జమ్మూకశ్మీర్లో విలేజి డిఫెన్స్గార్డు (గ్రామ రక్షకులు)గా పౌరులకు ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. అయితే తుపాకీ లైసెన్సులు మంజూరు లోను, వినియోగం లోనూ అవకతవకలు ఎన్నో జరగడంతో ఈ పథకం పక్కదారి పట్టింది. పంజాబ్ ప్రభుత్వం కూడా స్పెషల్ పోలీస్ ఆఫీసర్లుగా ఒకనాడు పౌరులకు శిక్షణ ఇచ్చింది. చత్తీస్గఢ్ ప్రభుత్వం నక్సల్స్ హింసను నివారించడానికి 2006లో గిరిజనులను సల్వాజుడుం పేరుతో నిఘా గ్రూపుగా ఏర్పాటు చేసింది.
అయితే భారీ ఎత్తున అక్రమ ఆయుధాలను పట్టివేయడం, మానవ హక్కుల ఉల్లంఘన తదితర సంఘనలు చోటు చేసుకోవడంతో సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంది. ఇటువంటి అమానవీయ వాతావరణం కల్పించడం యువత పెడదారి పట్టే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. పుస్తకాలకు బదులు యువతకు తుపాకీలు అందించడం, గార్డులుగా వారిని అడవుల్లో నిలబెట్టి దోపిడీకి అవకాశం ఇచ్చినట్టు అవుతుందని సుప్రీం కోర్టు హెచ్చరించింది. చివరకు దేశ విధ్వంసానికి బాట పరిచినట్టు అవుతుందని వ్యాఖ్యానించింది. సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పు అసోం ప్రభుత్వానికి కూడా వర్తిస్తుంది. అమెరికా తుపాకీ సంస్కృతిని అసోంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తే ఎన్నో హింసాత్మక సంఘటనలను రాష్ట్రం ఎదుర్కోవలసి వస్తుంది.