భక్తులకు ఎక్కడా ఇబ్బందులు
కలుగకుండా ఏర్పాట్లు ఇప్పటికే
రూ.20కోట్లు కేటాయించిన రాష్ట్ర
ప్రభుత్వం ఉత్సవాలకు 28
ఆలయాలు ముస్తాబు కార్యాచరణ
ప్రణాళికతో ముందుకెళ్లాలి
అధికారులకు మంత్రులు పొన్నం,
కొండా సురేఖ దిశానిర్దేశం
మనతెలంగాణ/హైదరాబాద్: 28 ఆలయాల్లో ఆషాఢ బోనాలను ఘనంగా నిర్వహించాలని, ఎక్కడా భక్తులకు ఇబ్బందులు రావొద్దని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, బిసి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లు అధికారులను ఆదేశించారు. బడ్జెట్కు లోటు లేదని, ప్రభుత్వం నుంచి ఇప్పటికే రూ.20 కోట్లు ఇచ్చామని, బోనాల జాతర ఘనంగా జరపాలని వారు సూచించారు. నిధులు కావాలంటే సిఎం దృష్టికి తీసుకెళ్దామని ప్రభుత్వం సానుకూలంగా ఉందని వారు పేర్కొన్నారు.
బోనాలను విజయ వంతంగా నిర్వహించేలా అధికారులకు మంత్రులు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న దానిపై ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి ముందుకు వెళ్లాలని వారు పేర్కొన్నారు. ఆషాఢ బోనాల జాతర సందర్భంగా మంత్రులు పలు శాఖల అధికారులతో ఎంసిఆర్హెచ్ఆర్డిలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డిజిపి జితేందర్, ఎండోమెంట్ డైరెక్టర్ వెంకట్రావు, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
గత సంవత్సరం మంత్రులకే ఇబ్బంది: మంత్రి కొండా
ఇబ్బందులు ఎక్కడా రావొద్దని, గత సంవత్సరం మంత్రి పొన్నం ప్రభాకర్కే ఇబ్బంది వచ్చిందని ఈసారి అలాంటిది సంఘటనలు పునరావృత్తం కావొద్దని అధికారులకు మంత్రి కొండా సురేఖ సూచించారు. ఆషాఢ బోనాల సందర్భంగా అమ్మవారి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని ఆమె తెలిపారు. జూన్ 26వ తేదీన తొలి బోనం గోల్కొండలో ప్రారంభం అవుతుండగా అనంతరం బల్కంపేట, ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ బోనాలు ఉంటాయని మంత్రి కొండా సురేఖ తెలిపారు. గోల్కోండ కోటలో బోనాలు సమర్పించుకోవడంతో తెలంగాణ బోనాలు మొదలవుతాయని మంత్రి పేర్కొన్నారు.
ఆషాఢ మాసం మొదటి గురువారం బోనాలు ప్రారంభమవుతుండగా చివరి ఆదివారం వరకు ప్రతి రోజూ విశేష పూజలు జరుగుతాయని మంత్రి తెలిపారు. గోల్కొండ బోనాలు ముగిసిన తర్వాతి వారం సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహాంకాళి అమ్మవారికి బోనం సమర్పిస్తారని ఆ వారం సికింద్రాబాద్ అంతటా బోనాలు జరుపుకుంటారని, ఆ తర్వాతి నుంచి లాల్దర్వజా, ధూల్పేట, బల్కంపేట, పాతబస్తీ, కొత్త బస్తీ అమ్మవారి ఆలయాల్లో బోనాల జరుగుతాయని మంత్రి కొండా సురేఖ తెలిపారు.
రంగం, తొట్టెల ఊరేగింపు కూడా ఉంటుందని మంత్రి కొండా పేర్కొన్నారు. దేవాలయాలకు ఇచ్చే చెక్లను రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు. అధికారులు ఉద్యోగం మాదిరిగా కాకుండా సేవ చేస్తున్నామన్న దృక్పథంతో చేయాలని మంత్రి కొండా తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు దైవ చింతనతో జరగాలని, లా అండ్ ఆర్డర్కు సంబంధించి పోలీసులు ఎక్కడా ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలతో సమన్వయం చేసుకోవాలని మంత్రి కొండా ఆదేశించారు.
మరో 10 శాతం నిధులు అదనంగా: మంత్రి పొన్నం
ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 2024 యాక్షన్ ప్లాన్ ని సరిచేసుకొని 2025లో ప్లాన్ను సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. గత సంవత్సరం జరిగిన పొరపాట్లు ఈసారి జరగకుండా చూసుకోవాలన్నారు. ఈసారి బోనాలకు నూతన దేవాలయాలను జత చేశామని ఈ నేపథ్యంలోనే మరో 10శాతం నిధులను విడుదల చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. డిజిపి జితేందర్ మాట్లాడుతూ గత ఏడాది చాలా ఫిర్యాదులు వచ్చాయని, వాటిని దృష్టిలో ఉంచుకొని భద్రతా చర్యలు చేపడుతున్నామన్నారు. అన్ని విభాగాలతో సమన్వయం చేసుకొని ప్రశాం తంగా బోనాల ఉత్సవాలు పూర్తయ్యేలా చూస్తామన్నారు. అన్ని శాఖల అధికారులతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు టచ్లో ఉండి సమన్వయం చేసుకుంటామని డిజిపి తెలిపారు.