Wednesday, August 20, 2025

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డే ప్రధాన సూత్రధారి

- Advertisement -
- Advertisement -

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టులో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. జస్టిస్ ఎంఎం .సుందరేశ్, జస్టిస్ ఎన్‌కె. సింగ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ హత్య వెనుక కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డే ‘మాస్టర్ మైండ్’ అని వివేకా కుమార్తె డాక్టర్ సునీత తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ధర్మాసనం ముందు తీవ్ర ఆరోపణలు చేశారు. అవినాష్ రెడ్డి సహా ఇతర నిందితుల బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వాడివేడి వాదనలు జరిగాయి. విచారణ సందర్భంగా సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తూ నిందితులు సాక్షులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నారని, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నా రని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కుట్రలో భాగంగానే డాక్టర్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, సిబిఐ మాజీ ఎస్‌పి రామ్ సింగ్‌లపై ఉద్దేశపూర్వ కంగా తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు.

ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని, అప్పుడే అసలు సూత్రధారులు, పాత్రధారులు బయటకు వస్తారని ఆయన వాదించారు. మరోవైపు, సిబిఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తూ ఈ కేసులో సాక్ష్యాల ధ్వంసం జరిగిందని దర్యాప్తులో స్పష్టంగా నిరూపితమైందని వెల్లడించారు. మొదట గుండెపోటు అని, ఆ తర్వాత రక్తపు వాంతులని ప్రచారం చేసి హత్యను కప్పిపుచ్చేందుకు అన్ని విధాలా ప్రయత్నించారని వివరించారు. ఈ నేరం తీవ్రతను బట్టి నిందితులకు మరణశిక్ష విధించే అవకాశం కూడా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఎపి ప్రభుత్వం తరఫు న్యాయవాది అహ్మదీ వాదిస్తూ నిందితుడు శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి, మెడికల్ క్యాంప్ పేరుతో కడప జైలుకు వెళ్లి అప్రూవర్‌గా మారిన దస్తగిరిని బెదిరించారని, ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని కోర్టుకు వెల్లడించారు. అనంతరం, ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవస రమా, నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించాలా అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని సీబీఐని ఆదేశిం చింది.

ఎంత మంది నిందితుల బెయిల్ రద్దు చేయాలన్న విషయాన్నీ చెప్పాలని సిబిఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. వివేకా కుమార్తె, అల్లుడు సునీతా రెడ్డి, నెర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, సీబీఐ విచారణాధికారి రామ్‌సింగ్‌పై పెట్టిన కేసులను క్వాష్ చేస్తామని వెల్లడించింది. చట్టాన్ని దుర్విని యోగం చేయడానికే వారిపై కేసు పెట్టారని ధర్మా సనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సుప్రీం ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News