బంగ్లాదేశ్ 484/9
లంకతో మొదటి టెస్టు
గాలె: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్లో (BAN vs SL) భారీ స్కోరును సాధించింది. బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 151 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 484 పరుగులు చేసింది. ఓవర్నైట్ స్కోరు 292/3తో తిరిగి బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్కు ఆరంభంలోనే షాక్ తగిలింది.
కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. 279 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్స్తో 148 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే తర్వాత వచ్చిన వికెట్ కీపర్ లిటన్ దాస్తో కలిసి మరో ఓవర్నైట్ బ్యాటర్ ముష్ఫికుర్ రహీం ఇన్నింగ్స్ను కుదుట పరిచాడు. (BAN vs SL) ఇద్దరు లంక బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. రహీం సమన్వయంతో బ్యాటింగ్ చేయగా దాస్ మాత్రం ధాటిగా ఆడాడు. ఈ జోడీని విడగొట్టేందుకు లంక బౌలర్లు చాలా సేపటి వరకు శ్రమించాల్సి వచ్చింది. దాస్ బ్యాటింగ్ వన్డేలను తలపించింది.
వరుస ఫోర్లతో అతను ప్రత్యర్థి జట్ల బౌలర్లను హడలెత్తించాడు. రహీం మాత్రం డిఫెన్స్కే పరిమితమయ్యాడు. మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన రహీం 350 బంతుల్లో 9 ఫోర్లతో 163 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో నజ్ముల్, దాస్లతో కలిసి రెండు కీలక భాగస్వామ్యాల్లో పాలుపంచుకున్నాడు. మరోవైపు చిరస్మరణీయ బ్యాటింగ్తో అలరించిన దాస్ 123 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్తో 90 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇదే సమయంలో సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. ఆ తర్వాత లంక బౌలర్లు వరుసగా వికెట్లను తీశారు. ఆట ముగిసే సమయానికి హసన్ మహమూద్, నాహిద్ రాణా క్రీజులో ఉన్నారు. కాగా, లంక బౌలర్లలో అసిత ఫెర్నాండో, మిలన్ రత్నాయకే, తరిండు రత్నాయకే మూడేసి వికెట్లను పడగొట్టారు.