రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే తప్పకుండా బీసీ నాయకుడే ముఖ్యమంత్రి అవుతాడని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. బిజెపిలో ఇప్పటికే బీసీల్లో తనకు, లక్ష్మణ్కు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారని అన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ పడవచ్చునని, అధ్యక్ష పదవి రానంత మాత్రాన మిగిలిన వారు డమ్మీలు కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బిజెపి రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు పేరును ఖరారు చేయడం, ఆయనతో నామినేషన్ వేయించే కార్యక్రమం సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ ఉన్నా లేకున్నా పార్టీ ఆగదని, అధిష్టానం నిర్ణయమే ఫైనల్- అని కుంద బద్దలు కొట్టారు.
అనవసరంగా సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు చెబితే అధ్యక్షుడిని పెట్టే పార్టీ బీజేపీ కాదని స్పష్టం చేశారు. బిజెపి కొత్త అధ్యక్షుడి పేరు చంద్రబాబు చెప్పడంతోనే తెరమీదకు రామచంద్రరావు పేరు వచ్చిందన్న సోషల్ మీడియా సమాచారంపై బండి సంజయ్ వివరణ ఇచ్చారు. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ బీజేపీ అని అన్నారు. దేశంలో, అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న తమ పార్టీ సిద్ధాంతం కోసం అంకితభావంతో పనిచేసే లక్షలాది మ ంది కార్యకర్తలున్న పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. అంత గొప్ప చరిత్ర కలిగిన బీజేపీ ఒకరు చెబితేనే, ఇంకొకరు ఒత్తిడి తెస్తేనో తలొగ్గి నిర్ణయం తీసుకునే పార్టీ బీజేపీ కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని బండి సంజయ్ హితవు పలికారు. ఇక బీసీలకు బీజేపీ అధ్యక్ష పదవి ఎందుకు ఇవ్వడం లేదనే బీఆర్ఎస్ నేతల ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.
తమను ప్రశ్నించే ముందు పార్టీ గురించి చూసుకోవాలని హితవు పలికారు. బిఆర్ఎస్లో కేసీఆర్ కాకుండా మరో నేతకు బీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దమ్ముంటే బీఆర్ఎస్ ప్రెసిడెంట్ పదవి బీసీలకు ఇవ్వాలని బండి సంజయ్ సవాల్ చేశారు. దళితుడిని సీఎం చేస్తా అని, చేయకపోతే తల నరక్కుంటా అంటూ కెసిఆర్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. బీఆర్ఎస్ నాయకుల మాదిరిగా తాము మాట తప్పే వాళ్లం కాదని అన్నారు. ఎవరైనా అధ్యక్షుడు కావాలని కోరుకోవడంలో కూడా తప్పులేదని, కానీ అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.