తెలంగాణ ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థుల తరపున ప్రశ్నించే గొంతుకగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మారారు. ఇటీవల కాలంలో బండి సంజయ్ వివిధ సమస్యలపై పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డికి లేఖలు రాశారు. ఈ క్రమంలో మరోసారి ఫీజు రీయింబర్స్మెంట్ పై సీఎం రేవంత్ రెడ్డికి తన లేఖలో ఫీజు రీయింబర్స్మెంట్ పై ఇచ్చిన హామీ ఏమైందని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇప్పటికే విద్యా సంవత్సరం అయిపోయి కొత్త విద్యా సంవత్సరం వస్తుందని ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు
తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్నారు. కొన్ని సంస్థల్లో సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని, ఈ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కారణంగా యాజమాన్యాలు తమ విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని బండి సంజయ్ తన లేఖలో గుర్తు చేశారు. ఈ కారణంగానే రాష్ట్రంలో ఇప్పటికే అనేక కాలేజీలు మూతపడ్డాయని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ కు రాసిన లేఖలో డిమాండ్ చేశారు.