కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ ఓ ‘ఇంటి’వాడయ్యారు. తొలిసారి ఓ ఇంటిని కొనుగోలు చేశారు. సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్న ఆయన రెండుసార్లు కార్పొరేటర్గా, రెండుసార్లు ఎంపిగా గెలిచారు. ప్రస్తుతం కేంద్రమంత్రిగా కొనసాగుతున్నారు. అయినప్పటికీ ఇంతకాలం తన అత్తమ్మ నివాసంలోనే కుటుంబ సభ్యులతో ఉంటున్నారు. ఇప్పటివరకు ఆయన పేరిట ఒక్క ఆస్తి కూడా లేదు. ఈ నేపథ్యంలో కరీంనగర్లో ఎంపి కార్యాలయం పక్కనున్న రెండు గుంటల స్థలం కలిగిన పాత నివాసం అమ్మకానికి రావడంతో రూ.98 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన మొత్తంలో రూ.85 లక్షలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రుణం తీసుకున్నారు. సంజయ్ సతీమణి అపర్ణ ఎస్బిఐ ఆఫీసర్ కావడంతో బ్యాంక్ లోన్తో ఆ ఇంటిని కొనుగోలు చేయడం గమనార్హం.
సోమవారం కరీంనగర్లోని సబ్ రిజిస్ట్రా కార్యాలయానికి విచ్చేసిన బండి సంజయ్కుమార్ ఆ ఇంటి రిజిస్టేషన్ పత్రాలు తీసుకున్నారు. మరోవైపు తొలిసారి చిన్న ఇంటిని కొనుగోలుచేసిన కేంద్ర మంత్రి ఎంపి కార్యాలయానికి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆ ఇంటిని చూపించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేయడం కన్పించింది. ఒక్కసారి కార్పొరేటర్గా, ఎంఎల్ఎగా గెలిస్తేనే వందల కోట్ల రూపాయలు ఆస్తులు కూడబెట్టకోవడం చూస్తున్నామని.. బినామీ పేర్లతో వేల కోట్ల ఆస్తులను దాచుకోవడం చూశామని.. కానీ సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగుతున్న సంజయ్ మాత్రం ఇప్పటివరకు చిల్లిగవ్వ కూడా సంపాదించుకోకుండా పార్టీకి, కార్యకర్తల కోసం ఖర్చు చేశారని. ఇన్నాళ్లకైనా ఓ ఇంటివాడైనందుకు సంతోషంగా ఉందంటూ ఆయన అనుచరులు వ్యాఖ్యానించడం విశేషం.