హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసుపై బిజెపి ఎంపి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని తానే ముందు చెప్పానని, హైదరాబాద్-సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రభాకర్రావు చాలామంది సంసారాలు నాశనం చేశారని, ప్రభాకర్, రాధాకిషన్ చాలామంది ఉసురుపోసుకున్నారని మండిపడ్డారు. ప్రభాకర్రావు ఆదేశాలతోనే తనని కూడా అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభాకర్రావును కాపాడే ప్రయత్నాలు చేస్తోందని దుయ్యబట్టారు. న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్, కెటిఆర్ కు నోటీసులు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. కెసిఆర్ సీఎంగా ఉన్న పదేళ్లలో ఫోన్ మాట్లాడాలంటేనే భయపడేవాళ్లమన్నారు. ఫేస్ టైం, సిగ్నల్ యాప్లలోనే ఫోన్ మాట్లాడుకున్నామని తెలియజేశారు. కెటిఆర్ తో మాట్లాడిన తర్వాతే ప్రభాకర్ భారత్ వచ్చారని, తాను సిట్ ఎదుట హాజరై వాంగ్మూలం ఇస్తానని బండి స్పష్టం చేశారు.