శ్రీలంకతో బుధవారం ప్రారంభమైన రెండో, చివరి టెస్టులో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. మొదటి రోజు 71 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ అనముల్ హక్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. వన్డౌన్లో వచ్చిన మోమినుల్ హక్తో కలిసి మరో ఓపెనర్ షద్మన్ ఇస్లాం ఇన్నింగ్స్ను కుదుట పరిచేందుకు ప్రయత్నించాడు. కానీ మోమినుల్ హక్ 21 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్లలో కూడా సెంచరీలు సాధించిన బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో ఈసారి నిరాశ పరిచాడు.
8 పరుగులు మాత్రమే చేసి పెవలియన్ చేరాడు. ఓపెనర్ షద్మన్ ఇస్లాం 7 ఫోర్లతో 46 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా వారిలో ముష్ఫికుర్ రహీం (35), మెహదీ హసన్ మిరాజ్ (31), నయీం హసన్ (25) పరుగులు చేశారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి తైజుల్ ఇస్లామ్ (9), ఇబాదత్ హుస్సేన్ (5) పరుగులతో క్రీజులో ఉన్నారు. లంక బౌలర్లలో అసితా ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో, సోనల్ దినుషా రెండేసి వికెట్లను పడగొట్టారు. కాగా, ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.