శ్రీలంకతో గాలె వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ టీమ్ మెరుగైన స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్లో ఆతిథ్య లంక జట్టును ఆశించిన స్కోరు కంటే తక్కువకే పరిమితం చేయడంలో బంగ్లాదేశ్ బ్యాటర్లు సఫలమయ్యారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ చేపట్టిన బంగ్లాదేశ్ శుక్రవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 57 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. బంగ్లాకు ఇప్పటి వరకు 187 పరుగుల ఆభిక్యం లభించింది. ఓపెనర్ షద్మన్ ఇస్లామ్, కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో అర్ధ సెంచరీలు చేసి బంగ్లాను ఆదుకున్నారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన షద్మన్ ఇస్లామ్ 126 బంతుల్లో ఏడు బండరీలతో 76 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ అనముల్ హక్ (4), వన్డౌన్లో వచ్చిన మోమినుల్ హక్ (14) నిరాశ పరిచారు.
అయితే శాంటో అద్భుత బ్యాటింగ్తో జట్టును ఆదుకున్నాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన శాంటో ఆట ముగిసే సమయానికి 113 బంతుల్లో ఆరు ఫోర్లతో 56 పరుగులు చేసి క్రీజులో నిలిచాడు. అతనికి సీనియర్ బ్యాటర్ ముష్ఫికుర్ రహీం (22) నాటౌట్ అతనికి సహకారం అందిస్తున్నాడు. అంతకుముందు లంక తొలి ఇన్నింగ్స్లో 131.2 ఓవర్లలో 485 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ పాథుమ్ నిసాంకా (187), చండీమల్ (54), మాథ్యూస్ (39), కమిండు మెండిస్ (87), రత్నాయకే (39) పరుగులు సాధించారు. బంగ్లా బౌలర్లలో నయీం హసన్ ఐదు, హసన్ మహమూద్ మూడు వికెట్లు పడగొట్టారు. కాగా, బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్లో 495 పరుగులు చేసింది. కెప్టెన్ శాంటో (148), రహీం (163), వికెట్ కీపర్ లిటన్ దాస్ (90) పరుగులు చేసి జట్టును ఆదుకున్నారు.