ముంబై: భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ను(IPL 2025) తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. కానీ, ఇప్పుడు ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో లీగ్ను తిరిగి ప్రారంభించాలని బిసిసిఐ(BCCI) భావిస్తోంది. ఈ మేరకు అన్ని ఫ్రాంచైజీలకు బిసిసిఐ కొత్త ఆదేశాలు ఇచ్చింది. మే 13లోగా పంజాబ్ కింగ్స్ మినహా మిగితా జట్లు అన్ని తమ హోం గ్రౌండ్స్లో ఉండాలని సూచించినట్లు సమాచారం. త్వరలో కొత్త షెడ్యూల్ని రూపొందించి ఐపిఎల్ను ప్రారంభించే ఆలోచనలో బిసిసిఐ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాక.. అన్ని జట్లు తమ విదేశీ ఆటగాళ్ల ప్రయాణ ప్రణాళికలను కూడా తెలియజేయాలని కోరినట్లు సమాచారం. దీంతో తమ విదేశీ ఆటగాళ్లను అన్ని జట్లు వెనక్కి రప్పించాలని ప్రయత్నాలు ప్రారంభించినట్లు టాక్.
మే 13 వరకూ అందరూ అందుబాటులోకి వస్తే.. ముందు నిర్ణయించిన ప్రకారం మే 25నే ఐపిఎల్(IPL) ముగించాలని ప్లాన్ చేస్తోందట బిసిసిఐ(BCCI). లీగ్ మ్యాచ్లను డబుల్ హెడర్లుగా చేసి త్వరగా ముగించాలనేదే ప్లాన్ అని తెలుస్తోంది. పంజాబ్ కింగ్స్కి మాత్రం తటస్థ వేదిక కేటాయిస్తారని సమాచారం. భారత ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే.. మే 15 లేదా 16 తేదీల్లో ఐపిఎల్ను పునః ప్రారంభించాలనే ప్లాన్ చేస్తున్నట్లు టాక్ బలంగా వినిపిస్తున్నాయి.