హైదరాబాద్: కులగణనను క్యాబినెట్, శాసనసభలో ప్రవేశపెట్టి ఆమెదించామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణన దేశంలోనే చరిత్రాత్మకంగా మారిందని ఫేర్కొన్నారు. ఇక్కడి ప్రభుత్వం కులగణన చేసి తర్వాత దేశవ్యాప్తంగా కులగణనపై చర్చ మొదలైందని తెలిపారు. కులగణన అవసరం లేదని కేంద్రంలోని బిజెపి మొదట మాట్లాడిందని.. తెలంగాణ సర్కారు, రాహుల్ గాంధీ ఒత్తిడితోనే జనగణనలో కులగణన చేస్తామని మోదీ ప్రకటించారని అన్నారు.
కులగణన సర్వే ఆధారంగానే బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు తలపెట్టామని.. బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉందని భట్టి (Bhatti Vikramarka) తెలిపారు. ఈ బిల్లుకు పార్లమెంట్లో అన్ని పార్టీల మద్దతు పొందే ప్రయత్నం చేస్తామని, అందుకు బిఆర్ఎస్, బిజెపి సహకరించాలని కోరారు. అసెంబ్లీలో రిజర్వేషన్ బిల్లుకు కొన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని.. ఆ పార్టీలు పార్లమెంట్లోనూ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు త్వరగా ఆమోదం పొందే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన చేపడతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని భట్టి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణనను పూర్తి చేసిందని.. జాతీయస్థాయిలో కులగణన అంశం తెరపైకి రావడంలో తెలంగాణది కీలకపాత్ర అని అది దేశానికే మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.