డిప్యూటీ సీఎంకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు
శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు
జన సందోహంగా మారిన ప్రజా భవన్
భారీగా తరలివచ్చిన ప్రముఖులు, కార్యకర్తలు, అభిమానులు
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగ్
మన తెలంగాణ / హైదరాబాద్ : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజాభవన్ చేరుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలు, ప్రజలు అభిమానులు భారీగా ప్రజాభవన్కు చేరుకున్నారు. ఉప ముఖ్యమంత్రికి మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, సీతక్క, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు,ప్రముఖ సినీనటుడు మురళీమోహన్ ప్రజాభవన్ చేరుకుని ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రవ్వాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో అభిమానులు కేక్ కటింగ్ చేశారు. ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంచిపెట్టారు. ఆదివారం ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆలయాల నుంచి విచ్చేసిన వేద పండితులు, అర్చకులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఆశీర్వాదాలు అందించారు. ప్రజాభవన్లో వెలిసిన అమ్మవారికి ఉప ముఖ్యమంత్రి దంపతులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో, ఆరోగ్య, ఐశ్వర్యాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు.
అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు లోకేష్ యాదవ్, తదితరులు ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రి చిత్రంతో రూపొందించిన భారీ కేక్ ను భట్టి విక్రమార్క చేత కట్ చేయించారు. అనంతరం అక్కడినుంచి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసేందుకు ఎల్బీనగర్ నియోజక వర్గం కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ పాఠశాలకు వెళ్లారు. అక్కడే విద్యార్థులతో కలిసి ఉప ముఖ్యమంత్రి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎంపీ మధుమాష్కీ గౌడ్, ఇతర స్థానిక నేతలు పాల్గొన్నారు.