ప్రపంచంలో సాగు విఫలించడం చేత ఏర్పడే ఆహార కొరత వల్ల సంభవించే కరువుల గురించి బైబిల్ వృత్తాంతాలు, భారతీయ సాహిత్యం, పురాతన గ్రంథాల్లో మనం వింటున్నాం. వీటిని ప్రాచీన ప్రజలు దైవిక శిక్షలుగా, పాప పరిణామాలుగా పరిగణించేవాళ్లు. ఇవి అప్పటి పౌరసమాజం జీవన విధానాన్ని ప్రభావితం చేసేవి. ఆధునిక ప్రపంచంలో కరువులకు అనేక కారణాలున్నాయి. అందులో ప్రధానంగా రాజకీయ ఉద్రిక్తతలు, ప్రకృతి వైపరీత్యలు, ఆర్థిక అసమానతలు, వనరుల కోసం పోటీ లాంటివి కీలక విషయాలు. కాగా, వీటికి మించి, అంతర్రాష్ట్ర విచ్ఛిన్నాలు, చట్టపాలన లేకపోవడం, ఉగ్రవాద గ్రూపులు విస్తృతంగా పెరగడంతో యుద్ధాలు, సాయుధ పోరాటాలు కరువులకు దారితీస్తున్నాయి. అయితే, ఆధునిక ప్రపంచంలో యుద్ధాలు, సాయుధ పోరాటాల స్వభావం గణనీయంగా మారిపోయింది. సాంకేతిక పురోగతి వల్ల ప్రాణాంతక ఆయుధాలు, సైబర్ దాడులు, డ్రోన్ లాంటి ఆయుధీకరణతోపాటు జీవాయుధాలు వినియోగంతో యుద్ధాల లక్ష్యాలు మారిపోయాయి.
బయోటెర్రరిజంతో మానవులు, పశువులు, పంటలకు హాని కలిగించడానికి లేదా చంపడానికి ఉపయోగించే విషపూరిత పదార్థాలు లేదా వ్యాధులు వ్యాప్తి చేసి దేశ ఆర్థిక పరిస్థితులను దెబ్బతీసి దేశాన్ని కరువులోకి నెట్టే ప్రమాదం ఉంది. వ్యవసాయాన్ని నాశనం చేయడానికి జీవసంబంధమైన ఏజెంట్లను ఉద్దేశపూర్వకంగా ఉపయోగించడాన్ని ‘ఆగ్రో టెర్రరిజం/ వ్యవసాయ ఉగ్రవాదం’ అని పిలుస్తారు.ఇటీవల ఒక చైనా పరిశోధకుడు ప్రమాదకరమైన పంటలను నాశనం చేసే శిలీంధ్రాన్ని అమెరికాలోకి అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నస్తుండగా పట్టుబడంతో వ్యవసాయ- ఉగ్రవాదం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదం, ఆర్థిక పోటీ మారుతున్న నేపథ్యంలో వ్యవసాయంపై దాడులు పెరిగే ప్రమాదం ఉంది.
దేశంలో సాగు చేస్తున్న పంటలను లక్ష్యంగా చేసుకొని పంటలను తీవ్ర నష్టానికి గురి చేయడానికి దీనిని ఉపయోగించవచ్చు. వ్యవసాయ ఉగ్రవాదంతో వ్యవసాయ రంగంపై ( agricultural sector) ప్రత్యక్ష లేదా పరోక్షంగా దాడుల చేసి దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి పన్నాగాలు పడే అవకాశం ఉంది. ఆగ్రో టెర్రరిజం అన్నది ప్రపంచంలో కొత్త కాదు పురాతన కాలం నుండి అంటు సూక్ష్మజీవులు లేదా జీవసంబంధమైన విష పదార్థాలను యుద్ధంల్లో ఉపయోగిచారు. 660 బిసి, అస్సిరియన్లు శత్రువుల నీటి వనరులను కలుషితం చేయడానికి రై ఎర్గోట్ (క్లావిసెప్స్ పర్పురియా) కలిగిన మైకోటాక్సిన్ను ఉపయోగించారు. 20వ శతాబ్దంలో, మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో జర్మన్లు శత్రువుల గుర్రాలకు హాని కలిగించేందుకు గ్లాండర్లను (బుర్ఖోల్డెరియా మల్లె), ఆంత్రాక్స్ (బాసిల్లస్ ఆంత్రాసిస్), ఆహార ధాన్యపు పంటలపై శిలీంధ్రాలను ఉపయోగించారని ఆరోపణలున్నాయి.
రెండవ ప్రపంచా యుద్ధ సమయంలో మొదట్లో జపాన్లో వరి పంటను నాశనం చేయాలని అమెరికా ప్రణాళిక వేసిందని, కానీ తరువాత జపాన్ను లొంగిపోయేలా అణుబాంబును ఉపయోగించాలని నిర్ణయించుకుంది ఆరోపణలున్నాయి. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న మన దేశంలో సుమారుగా 156.06 మిలియన్ హెక్టార్ల వ్యవసాయ యోగ్యమైన భూమితో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద వ్యవసాయ యోగ్యమైన భూమిని కలిగి ఉంది. దేశవ్యాప్తంగా మొత్తం పంట విస్తీర్ణం 219.16 మిలియన్ హెక్టార్ల (2022) కాగా, 2023-24లో దేశంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 3322.98 లక్షల మెట్రిక్ టన్నులు. 2024- 25 ఆర్థిక సర్వే ప్రకారం, దేశ జనాభాలో సుమారుగా 45.8 శాతం ప్రజలు వ్యవసాయ రంగంమీద ఆధారపడి జీవనోపాధి కొనసాగిస్తున్నారు. అందువల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం వెన్నెముకగా నిలుస్తుంది. ఈ విధంగా సస్యశ్యామలంగా సాగుతున్న దేశ వ్యవసాయ రంగా అభివృద్ధికి అగ్రి టెర్రరిజం అనేది గొడ్డలి పెట్టువంటిది.
మానవ ఆరోగ్యానికి హాని కల్గించే బయోవార్ కంటే వ్యవసాయ ఉగ్రవాదం అమలు చేయడానికి చాలా సులభం. ఎందుకంటే శత్రువుల లక్షాలైనా వ్యవసాయ భూములు విస్తీర్ణంలో చాలా పెద్దవిగా, పేలవమైన నిఘా కలిగి ఉంటాయి. మన దేశంలో కేవలం వరి, గోధుమలు కలిపి దాదాపుగా 80 మిలియన్ల హెక్టర్లలో (2022 -23) పండిస్తున్నారు. ఈ విధంగా ఏక పంటల సంస్కృతి ఉన్న దేశంలో వ్యవసాయ ఉగ్రవాద కార్యకలాపాలకు మరింత సులభతరమవుతుంది. అంతేకాకుండా, పంటల్లో ఒకసారి స్థాపించబడిన వ్యాధి కారకాలు/ తెగుళ్లు నిర్మూలించడం కష్టం. ఫలితంగా వరుస పంటలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అదే విధంగా, భారతదేశం 15,106.7 కి.మీ భూ సరిహద్దును, ద్వీపభూభాగాలతో సహా 7,516.6 కి.మీ తీరప్రాంతాన్ని కలిగి వుండడం వల్ల వ్యవసాయ ఉగ్రవాదానికి పాల్పడడానికి మరింత సులభమవుతుంది.
ఈ తరుణంలో దేశ వ్యవసాయ రంగాన్ని శత్రువు మూకల దాడులను నుండి కాపాడి దేశప్రజలకు సరిపడా ఆహార భద్రతా కల్పించడానికి సరైన జీవభద్రతా చాలా అవసరం. మన దేశంలో జీవభద్రతను కాపాడుకోవడానికి భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసిఎఆర్), రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు (ఎస్ఎయుఎస్), రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వ్యవసాయ విభాగాలు, ప్రభుత్వేతర సంస్థలు (ఎన్జిఒఎస్), గుర్తింపు పొందిన ప్రైవేట్ సిబ్బంది మొదలైన అంతర్ -ప్రభుత్వ సంస్థల చేత అతిపెద్ద మొక్కల సంరక్షణ నెట్వర్క్ను కలిగి ఉంది. డైరెక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్, క్వారంటైన్, స్టోరేజ్ (డిపిపిక్యూ &ఎస్) అనేది భారతదేశ జాతీయ మొక్కల రక్షణ సంస్థ (ఎన్పిపిఒ), డిపిపిక్యూ & ఎస్ ద్వారా దేశంలో సురక్షితమైన వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి, ఫైటోసానిటరీ తనిఖీ, చికిత్స, ధ్రువీకరణ మొదలైన వ్యవసాయ వస్తువుల ఎగుమతికి సంబంధించిన అన్ని ఫైటోసానిటరీ బాధ్యతలను ఇది చేపడుతుంది.
అదే విధంగా, దేశంలో ‘విధ్వంసక కీటకాలు & తెగుళ్ల చట్టం- 1914 ద్వారా పంటలకు విధ్వంసం కలిగించే లేదా హాని కలిగించే కీటకాలు, శిలీంధ్రాలు లేదా ఇతర తెగులు ప్రవేశించకుండా నిరోధించడం. అంతేకాకుండా భారతదేశం ఎఫ్ఎఒ అంతర్జాతీయ మొక్కల రక్షణ సమావేశం (ఐపిపిసి)లో సంతకం చేసిన సభ్యదేశం. అందుకనుగుణంగా, ప్లాంట్ క్వారంటైన్ (భారతదేశంలోకి దిగుమతి నియంత్రణ) ఆర్డర్, 2003 ప్రకారం ద్వారా దేశం మొత్తం మీద 46 ఓడరేవులు, 24 విమానాశ్రయాలు, 24 ల్యాండ్ కస్టమ్ స్టేషన్లు సహా మొత్తం 94 ఎంట్రీ పాయింట్లతోపాటు, 77 ఇన్ల్యాండ్ కంటైనర్ డిపో/ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు, 11 విదేశీ పోస్టాఫీసుల్లో మొక్కలు/ మొక్కల పదార్థాల ప్రవేశానికి నోటిఫై చేయబడ్డాయి. వీటి ద్వారా దేశంలోకి ఎగుమతి, దిగుమతి చేయబడుతున్న వ్యవసాయ ఉత్పత్తుల ఫైటోసానిటరీ సర్టిఫికేషన్ కూడా అంతర్జాతీయ మొక్కల రక్షణ సమావేశం (ఐపిపిసి)- 1951 ప్రకారం చేపడుతున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో జీవసంబంధమైన ఆయుధాలను నియంత్రించడానికి బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ (బిడబ్లుసి) -1972 ఏర్పాటు చేయ్యబడింది. బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ ప్రకారం సభ్యదేశాలు జీవాయుధాలను అభివృద్ధికి, ఉత్పత్తికి, నిల్వచేయడానికి, సంపాదించడానికి లేదా వాడకాన్ని సమర్థవంతంగా నిషేధిస్తుంది. 2025 నాటికి, బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్లో 189 దేశాలు ఈ ఒప్పందాన్ని ఆమోదించాయి, దానికి కట్టుబడి ఉన్నాయి. భారతదేశం 1973లో బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్పై సంతకం చేసి జీవ, విష ఆయుధాల అభివృద్ధి పూర్తిగా నిషేధించడానికి మద్దతు తెలిపింది. అయితే, ఈ ఒప్పందంపై సంతకం చేసినప్పటికీ, కొన్ని దేశాలు జీవసంబంధ ఆయుధ సౌకర్యాలను అభివృద్ధి చేస్తూనే ఉన్నాయని ఆరోపణలున్నాయి,
అందులో 1990ల ప్రారంభంలో సోవియట్ యూనియన్, 1980 లో ఇరాన్- ఇరాక్ యుద్ధం సమయంలో ప్రధాన ఆహార పంటలపై దాడి చేయడానికి వివిధ రకాల జీవసంబంధ ఆయుధ సౌకర్యాలను కలిగి వున్నాయని అనేక రకాల కథనాలు వెల్లడించాయి. ఈ తరుణంలో వ్యవసాయ ఉగ్రవాదాన్ని నివారించడానికి నిఘా, భద్రత, బలమైన అత్యవసర ప్రతిస్పందనను అనుసంధానం చేసే బహుముఖ విధానం అవసరం. అందుకు దేశవ్యాప్తంగా వ్యాధి కారకాలు, తెగుళ్ల డేటాబేస్లను అభివృద్ధి చేసి స్పష్టమైన కమ్యూనికేషన్ విధానాల ద్వారా దేశంలోనే అన్ని ప్రవేశ ద్వారాలకు సమాచారాన్ని చేకూర్చి అధునాతన సాంకేతిక విధానాల చేత కఠినమైన పరిశుభ్రత ప్రోటోకాల్లను పాటించడం ద్వారా వ్యవసాయ ఉగ్రవాదాన్ని అరికట్టి దేశ వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవచ్చు.
-డా. రేపల్లె నాగన్న
79908 42149