న్యూఢిల్లీ: గత 75 సంవత్సరాలుగా ప్రధాన పొలిటికల్ పార్టీలు ఆచరిస్తున్న హిందూ-ముస్లిం రాజకీయాలే దేశంలోని అన్ని సమస్యలకు మూల కారణమని ఢిల్లీ మాజీ సిఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మంగళవారం పార్టీ విద్యార్థి విభాగం- అసోసియేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ (ASAP) ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. “మన దేశం చాలా సమస్యలతో సతమతమవుతోంది. ప్రజలకు ఆహారం, విద్య అందుబాటులో లేదు. ఇలా ఎందుకు జరుగుతోంది?.. ఎందుకంటే బిజెపి, కాంగ్రెస్, ఇతర పార్టీలు గత 75 సంవత్సరాలుగా రాజకీయాల్లో మాత్రమే మునిగిపోయాయి” అని విమర్శించారు. “ఈ పార్టీలు మన పాఠశాల పిల్లలకు హిందూ-ముస్లిం గురించి మాత్రమే బోధిస్తున్నాయి. మన దేశంలో సమస్యలకు ఇదే మూల కారణం” అని ఆయన అన్నారు.
ప్రస్తుత బిజెపి ప్రభుత్వం.. దేశ రాజధానిలో విద్యా వ్యవస్థను నాశనం చేస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. నగరంలో సుదీర్ఘ విద్యుత్ కోతలపై ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. “ఇప్పుడు ఢిల్లీలో మూడు నుండి నాలుగు గంటల పాటు విద్యుత్ కోతలు ఉన్నాయి. ఇలా గతంలో జరగలేదు. మూడు నెలల్లోనే, వాళ్లు(బిజెపి) ఢిల్లీలో విద్యను నాశనం చేయడం ప్రారంభించారు” అని ఆయన మండిపడ్డారు. ఆప్ పదేళ్ల పాలనలో ప్రైవేట్ పాఠశాల మాఫియా ఫీజులు పెంచడానికి అనుమతించలేదని ఆయన చెప్పారు. ఎన్నికలను పూర్తి నిజాయితీతో ఎదుర్కోవచ్చని ఆప్ నిరూపించిందని కేజ్రీవాల్ అన్నారు. ASAP గురించి మాట్లాడుతూ.. ఫోరం కింద దేశవ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో విద్యార్థి సాంస్కృతిక బృందాలు ఏర్పడతాయని ఆయన చెప్పారు.