బాచుపల్లిలోని ఓ నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ అనే కాలనీలోని నిర్మానుష్య ప్రాంతంలో ట్రావెల్ సూట్కేసులో గుర్తు తెలియని మహిళా మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. అక్కడ పని చేస్తున్న వాచ్మెన్కి సూట్కేసు నుంచి భరించలేని దుర్వాసన వస్తుండడంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న బాచుపల్లి పోలీసులు, డాగ్ స్క్వాడ్తో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని సూట్కేసును తెరిచి చూడగా, అందులో మహిళ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండడం గుర్తించారు.
మృతురాలి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఆమె వయస్సు సుమారు 30 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. శవం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో సుమారు 10- నుంచి 15 రోజుల క్రితమే మృతి చెంది ఉండొవచ్చునని అనుమానం వ్యక్తం చేసారు. ఈ హత్య వేరే చోట చేసి శవాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పడేశారా ? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్, కూకట్పల్లి ఏసీపీ రవి కిరణ్ రెడ్డి పరిశీలించారు.
మహిళా మిస్సింగ్ కేసులపై దర్యాప్తు ముమ్మరం
బాచుపల్లిలో సూట్ కేసులో లభ్యమైన మహిళ మృతదేహం ఆనవాళ్ళ కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇటీవల నమోదైన మహిళా మిస్సింగ్ కేసులను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు డాగ్ స్క్వాడ్ బృందం, క్లూస్ టీమ్ను రప్పించి ఆనవాళ్ల కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వాచ్మెన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
దర్యాప్తు కోసం నాలుగు బృందాలు రంగంలోకి
సూట్ కేసులో లభించిన మహిళ మృతదేహం ఇక్కడికి ఎలా తీసుకువచ్చారు ? ఏ వాహనంలో వచ్చింది ఎటువైపు నుంచి వచ్చిందనే కోణంలో బాచుపల్లి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆ మార్గంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మహిళపై అత్యాచారం చేశారా.. ? లేక కేవలం హత్య చేసి ఇక్కడ నిర్మానుష ప్రాంతంలో తీసుకువచ్చి పడేసారా ? అనే విషయం నిజాలు వెలుగులోకి తెచ్చేందుకు ప్రత్యేకంగా నాలుగు దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసినట్లు సీఐ ఉపేందర్ తెలిపారు.