Saturday, June 7, 2025

అగ్రశ్రేణి అభ్యుదయ రచయిత బొల్లిముంత

- Advertisement -
- Advertisement -

బొల్లిముంత శివరామకృష్ణ (నవంబరు 27, 1920 – జూన్ 7, 2005) అగ్రశ్రేణి అభ్యుదయ రచయిత, ఉపాధ్యాయుడు, హార్మోనిస్టు, నటుడు, గాయకుడు, కవి, కథారచయిత, నవలాకారుడు, బుర్రకథా, హరికథా రచయిత, జర్నలిస్టు, సినిమా రచయిత, అభ్యుదయ రచయితల సంఘం నాయకుడు, రాజకీయ కార్యకర్త, నిబద్ధత గల కమ్యూనిస్టు నేత. తెలుగు సాహితీ లోకంలో ఆయన నిశ్శబ్ద విప్లవం, మార్క్సిస్టు గాంధీ అని గుర్తింపు పొందారు. 1920 నవంబరు 27వ తేదీన గుంటూరు జిల్లా వేమూరు మండలం, చదలవాడలో మంగమ్మ, అక్కయ్య దంపతులకు జన్మించిన శివరామకృష్ణ ప్రాథమిక, మాధ్యమిక విద్య స్వగ్రామంలో కొనసాగించి, గుంటూరులో హయ్యర్‌గ్రేడ్ శిక్షణ పూర్తి చేశారు.

అక్కడ విద్యార్థి ఉద్యమంతో, ఆ తర్వాత చదలవాడలో ఉద్యోగంలో చేరినప్పుడు కమ్యూనిస్టు ఉద్యమంతో ప్రత్యక్ష సంబంధం ఏర్పడింది. ఆ రోజుల్లోనే ఆయన ‘దేశం ఏమయ్యేట్టు?’, ‘వ్యక్తి స్వాతంత్య్రం’ వంటి కథలు రాసి ప్రచురించారు. సంస్కృతాన్ని, సంగీతాన్ని స్వయం కృషితో నేర్చుకున్నారు. రైతులు, వ్యవసాయ కార్మికుల పిల్లలకు విద్యాబోధన చేశారు. బొల్లిముంత 16వ ఏట రచించిన ఏటొడ్డు కథ చిత్రాంగి పత్రికలో అచ్చయింది. అది ఆయన తొలి రచన. 1936లో మద్రాసు నుండి వెలువడే ‘చిత్రాంగి’ పత్రికలో తన తొలి కథ ‘ఏటొడ్డు’ ప్రచురించారు. 1945లో తన ఉపాధ్యాయ వృత్తిని వదలి వ్యవసాయ కార్మిక సంఘంలో చేరి చల్లపల్లి రాజాకి వ్యతిరేకంగా సాగిన భూపోరాటంలో పాల్గొన్నారు. ఆ పోరాట అనుభవాలతోనే తొలి రాజకీయ నవల మృత్యుంజయులు రాశారు. నగారా అనే పత్రిక నడిపారు.

బెంగాల్ కరవుపై బుర్రకథ రాశారు. ‘రైతుబిడ్డ’ హరికథ రాశారు. పార్టీ పనులమీద తిరుగుతూ మునగాల పరగణాలోని జగ్గయ్యపేటకు వెళ్ళి రావడం జరుగుతూ ఉండేది. అక్కడే తెలంగాణ పోరాటం గూర్చి వినడం ద్వారా ఉత్తేజితుడైన యువకుడు బొల్లిముంత ఇరవై ఏడేళ్ళ వయసులో ‘మృత్యుంజయులు’ నవల రాశారు. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన 1946 -51 మధ్య అర్ధదశాబ్ద కాలంపాటు తెలంగాణ రైతులు సాయుధులై దోపిడీ వర్గాలమీద తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటులో కవులు, రచయితలు, కళాకారులు ఎంతోమంది భాగస్వాములయ్యారు.

1946లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమైతే, సదరు పోరాటానికి తొలి అక్షర రూపంగా, ఆ పోరాటం వస్తువుగా 1947లో ‘మృత్యుంజయులు’ నవల అచ్చయింది. 1947 అక్టోబరు 25న విడుదల చేశారు. తెలంగాణ ప్రాంత స్థితిగతులను సహజంగా, యథాతథంగా చిత్రించిన ఆ నవల విశేష ఆదరణ పొందింది. నైజాం రాజ్యంలో నాటి పరిస్థితుల్ని, దేశముఖులు, పటేళ్ళ ఆగడాల్నీ, సామాన్య ప్రజలు ముఖ్యంగా గ్రామీణ రైతాంగ ప్రజానీకం అనుభవిస్తున్న కష్టాల్నీ, యువకుల్లో తలెత్తుతున్న తిరుగుబాటు ధోరణుల్నీ అక్షరీకరించి, ఇక్కడి ప్రజల్లో చైతన్యాన్నీ, బయటివారిలో సంఘీభావాన్ని రేకెత్తించి ఉద్యమ దిశగా జనాన్ని సమాయత్తం చేయడం ఆ నవల రచనా నేపథ్యం.

దేశంలో ఇతర ప్రాంతాల్లో రైతులు పంటలు పండించుకున్నందుకు శిస్తులు చెల్లిస్తే, తెలంగాణలో నాడు శిస్తులు కట్టడానికి మాత్రమే పంటలు పడించాల్సిన దుర్భర స్థితిని సహజంగా చిత్రించింది మృత్యుంజయులు నవల. పాలకుల నిరంకుశ పాలనను సహించలేక, అనుదినం చస్తూ బతకడం కన్నా, భావితరాల భవిష్యత్తు కోసం చావడానికి సైతం సిద్ధమై, పోరాటంలో నేలకొరిగిన వీరులే మృత్యుంజయులు. నవలలోని ముఖ్య పాత్రలన్నీ పోరాటంలో వీరమరణం పొందడం జరుగుతుంది. తెలంగాణ పోరాట కాలంలో వెలువడిన తొలి నవలగా, ఒక చారిత్రక అవసర నేపథ్యంలో, ప్రజా పోరాటాన్ని కళ్ళకుకట్టినట్లు వివరించే నవలగా తెలుగు సాహిత్యంలో మృత్యుంజయులు నవల సుస్థిర స్థానం పొందింది. ఆ తర్వాత గంగినేని ‘ఎర్రజెండాలు’, వట్టికోట ‘ప్రజల మనిషి’, ‘గంగు’, ‘మహీధర రామ్మోహనరావు’, ‘ఓనమాలు’, మృత్యునీడల్లో’, తిరునగరి ‘సంగం’ వంటి నవలలు వెలువడ్డాయి. బొల్లిముంత క్రమంగా ప్రజారంగాన్ని వదిలి 1960లో మద్రాసు సినిమా రంగంలోకి ప్రవేశించారు.

ఆచార్య ఆత్రేయకు ఘోస్ట్ రైటర్‌గా కలిసి ఉంటే కలదు సుఖం, కలిమిలేములు మొదలైన చిత్రాలకు సంభాషణలు రాశారు. ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన వాగ్దానం చిత్రానికి సహరచయితగా తెరపైకెక్కారు. నాటి నుంచి బిఎస్ నారాయణ దర్శకత్వం వహించిన చిత్రాలన్నింటికీ బొల్లిముంత సంభాషణలు రచించారు. 1968లో విశాలాంధ్ర ప్రారంభించిన ప్రతిభ వారపత్రికకు సంపాదకుడయ్యారు. దర్శకుడు వి. మధుసూదనరావు చిత్రాలకు ఎన్నిటికో సంభాషణలు రాశారు. ఆయన రాసిన దాదాపు యాభై సినిమాల్లో మనుషులు మారాలి, ప్రజానాయకుడు వంటి సీరియస్ సినిమాలేకాక శారద, కళ్యాణ మంటపం, మూగకు మాటొస్తే, విచిత్రబంధం వంటి సెంటిమెంట్ ప్రధానమైన చిత్రాలు కూడా ఉన్నాయి. నాటకాల్లో హార్మోనియం వాయించారు. స్త్రీ పాత్రలు ధరించారు. బొల్లిముంత ‘ప్రజాపక్షం’ మాసపత్రికకు సంపాదకత్వ బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్‌లో అరసం నిర్మాణంలో ఒకరు. నమ్మిన సిద్ధాంతాల పట్ల జీవిత పర్యంతం నిబద్ధత కలిగిన అభ్యుదయ మానవతావాది బొల్లిముంత జీవితం, వ్యక్తిత్వం, సాహిత్యం తరతరాలకూ స్ఫూర్తిదాయకం. 2005 జూన్ 7న బొల్లిముంత ఈ లోకం వీడి వెళ్ళారు.

రామ కిష్టయ్య సంగనభట్ల
94405 95494

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News