ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారు అనే సామెత పాకిస్థాన్ (Pakistan) విషయంలో 100 శాతం కరెక్ట్ అని చాలాసార్లు రుజువైంది. ఉగ్రవాదాన్ని పోషిస్తున్న ఆ దేశంలోనే ఉగ్రవాదులు దాడులు చేసి ఎన్నో ప్రాణాలను బలిగొన్నారు. కొన్నేళ్ల క్రితం శ్రీలంక క్రికెట్ జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో.. ఆ దేశంలో పర్యటించే సాహసాన్ని ఏ జట్టు కూడా చాలా సంవత్సరాల వరకూ చేయలేదు. ఈ మధ్యకాలంలో తమ దేశంలో భద్రతను కల్పిస్తామని పాక్ హామీ ఇవ్వడంతో అక్కడ అడపాదడపా క్రికెట్ సిరీస్లు, కొన్ని నెలల క్రితం ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ జరిగాయి.
అయితే తాజాగా పాకిస్థాన్లో (Pakistan) మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్లో ఉగ్రదాడి జరిగింది. బబౌర్ జిల్లా ఖార్ తహసీల్లోని కౌసర్ క్రికెట్ గ్రౌండ్లో మ్యాచ్ జరుగుతున్న సమయంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారని స్థానిక పోలీసులు వెల్లడించారు. ఈ పేలుడులో ఐఇడిని ఉపయోగించారని తెలిపారు. గాయపడిన వారిని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని జిల్లా పోలీసు అధికారి వక్వాస్ రఫీక్వ్ పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకూ ఏ ఉగ్రవాద సంస్థ కూడా పేలుడుకు బాధ్యత తీసుకోలేదని అన్నారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భద్రతా దళాలు ప్రారంభించిన ‘ఆపరేషన్ సర్బకాఫ్’కు ప్రతిస్పందనగా ఈ దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు.
పేలుడు కారణంగా క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లు, మైదానంలో ఉన్న ప్రేక్షకులు భయంతో పరుగులు తీయడంతో స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. అయితే వచ్చే నెలలో పాకిస్థాన్లో సౌతాఫ్రికా పర్యటించనుంది. ఈ టూర్కి ముందు పాక్లో ఇలాంటి ఉగ్రదాడులు జరగడం పాకిస్థాన్ క్రికెట్ బోర్డును ఆందోళనకు గురి చేస్తుంది. రాబోయే రోజుల్లో ఇటువంటి ఘటనలు జరిగితే సౌతాఫ్రికా బోర్డు తమ పర్యటన నిర్ణయాన్ని రద్దు చేసుకొనే అవకాశం ఉంది.
Also Read : జింబాబ్వే కెప్టెన్ సంచలనం.. కోహ్లీ, సూర్యల రికార్డు బద్దులు