హైదరాబాద్: ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా రెండు భారీ చిత్రాలు విడుదల కానున్నాయి. అందులో ఒకటి సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన ‘కూలీ’ (Coolie) చిత్రం కాగా.. మరొకటి ఎన్టిఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో వస్తున్న ‘వార్-2’ (War-2). ఈ రెండు సినిమాలపై తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరో సినిమా చూద్దామా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే అభిమానుల ఎధురుచూపులకు ఎట్టకేలకు తెరపడింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు సినిమాల బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్లలో టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణలో టికెట్ ధరల పెంపు లేదు. సింగిల్ స్క్రీన్లలో రూ.175, మల్టీప్లెక్స్లో రూ.295కే టికెట్లు లభిస్తున్నాయి.
అయితే మార్నింగ్ షో కన్న ముందు ఒక షో ప్రదర్శించేందుకు థియేటర్లకు అనుమతి ఇచ్చారు. దీంతో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఈ స్పెషల్ షోని ప్రదర్శించనున్నారు. ఈ స్పెషల్ షో ప్రదర్శనలకు థియేటర్ల ఎంపికలో చాలా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో టికెట్ల పెంపుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్లో రూ.75(జిఎస్టితో కలిపి), మల్టీప్లెక్స్లో రూ.100(జిఎస్టితో కలిపి) పెంచుకొనే వెసులుబాటు కల్పించారు. కూలీ (Coolie), వార్-2 (War-2) రెండు సినిమాలకు ఇది వర్తిస్తుంది. ఆగస్టు 14 నుంచి ఆగస్టు 23 వరకూ ఈ ధరలు అమలులో ఉంటాయి. దీంతో పాటు కూలీ సినిమా విడుదల రోజు అదనపు షోకి కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.