కాఠ్మాండు: రుతుపవనాల కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో నేపాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నేపాల్-చైనా మధ్య ఉన్న మైత్రి వంతెన బోటెకోషి వద్ద మంగళవారం కొట్టుకుపోయింది. ఈ వరదల కారణంగా 12 మంది నేపాలీలు, 6 మంది చైనీయులు గల్లంతయ్యారు. కాట్మాండుకు ఈశాన్యంగా 120 కిమీ దూరంలో ఉన్న ఈ వంతెన వరద బీభత్సంతో మంగళవారం తెల్లవారు జామున 3.15 గంటల సమయంలో కూలిపోవడంతో సరిహద్దులో ట్రాఫిక్ దెబ్బతింది. తప్పిపోయిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఇద్దరు పోలీస్ అధికారులతోపాటు మొత్తం 11 మందిని నేపాల్ ఆర్మీ, సాయుధ పోలీస్, నేపాల్ పోలీస్ సంయుక్త బృందం రక్షించినట్టు జాతీయ విపత్తునివారణ అథారిటీ వెల్లడించింది.
వరదల వల్ల భారీ నష్టం జరిగిందని రసూవా జిల్లా ప్రధాన అధికారి అర్జున్ పాడెల్ వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తక్షణం తరలి వెళ్లాలని అధికారులు హెచ్చరించారు. ఈలోగా ధాడింగఖ జిల్లా గజూరి మున్సిపాలిటీ పరిధి లోని త్రిశూలి నది నుంచి రెండు మృతదేహాలను పోలీసులు వెలికి తీయగలిగారు. వరదలతో మునిగిపోయిన రసువగఢి జలవిద్యుత్ ప్రాజెక్టు వద్ద చిక్కుకుపోయిన చైనా జాతీయుడు ఒకరితోపాటు మొత్తం 22 మంది కార్మికులను, నేపాల్ ఆర్మీ రక్షించగలిగింది. జలవిద్యుత్ ప్రాజెక్టు కూడా పాక్షికంగా దెబ్బతింది.