హైదరాబాద్: బనకచర్ల ప్రాజెక్టు గురించి బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు చేసిన ఆరోపణలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తోసిపుచ్చారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తున్నామని ఆయన అన్నారు. జనవరి 22న కేంద్ర జలశక్తి, ఆర్థికశాఖ మంత్రులకు లేఖ రాశానని.. బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలిపినట్లు పేర్కొన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ మౌనం వహించలేదని.. ప్రాజెక్టుపై చట్టపరంగా ముందుకెళ్తున్నామని తెలిపారు.
ఈ విషయంలో హరీశ్రావు వాదనలు నిరాధారం, తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ఉత్తమ్ (Uttam Kumar Reddy) మండిపడ్డారు. నదీ జలాల హక్కులపై తెలంగాణకు నష్టం చేసింది బిఆర్ఎస్ పార్టీనే అని ఆరోపించారు. కృష్ణానది వాటాను కేవలం 299 టిఎంసిలకే పరిమితం చేశారని.. బిఆర్ఎస్ హయాంలోనే ముచ్చుమర్రి, మాల్యాల నుంచి నీటిని తరలించారని అన్నారు. రాయలసీమ ఎత్తిపోతలపై అపెక్స్ కౌన్సిల్ను మీరెందుకు సంప్రదించలేదని ప్రశ్నించారు. ఎపి రోజూ 3 టిఎంసిలు మళ్లిస్తుంటే కెసిఆర్ చోద్యం చూశారని.. జగన్, కెసిఆర్ మధ్య అవగాహనతోనే తెలంగాణ నీటిని ఎపికి దోచిపెట్టారని పేర్కొన్నారు.