దీక్షకు అనుమతి లేదంటూ అరెస్ట్ చేసిన పోలీసులు
మనతెలంగాణ/యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట మండల పరిధిలోని మల్లాపురం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మల్లాపురం గ్రామంలోనే మెడికల్ కాలేజీని నిర్మించాలంటూ బిఆర్ఎస్ నేతలు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఆదివారం బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన నేతలను పోలీసులు అరెస్ట్ చేసి యాదగిరిగుట్ట పోలీసు స్టేషన్కు తరలించారు. దీంతో మల్లాపురం గ్రామంతో పాటు యాదగిరిగుట్ట పోలీసు స్టేషన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య మాట్లాడుతూ రూ.183 కోట్లతో మెడికల్ కాలేజీ యాదగిరిగుట్టకు అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిందని, కాలేజీ నిర్మాణం కోసం మల్లాపురం గ్రామంలోని 64 సర్వే నెంబర్లో 20 ఎకరాల భూమిని వైటిడిఎ కేటాయించిందని తెలిపారు.
ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో కాలేజీ నిర్మాణం ప్రారంభించలేకపోయామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీని వేరే ప్రాంతానికి తరలించేందుకు స్థానిక ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నాడని తెలిపారు. మల్లాపురం గ్రామంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. వేరే ప్రాంతంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం ద్వారా ఎమ్మెల్యే లబ్ధి పొందుదామని చూస్తున్నారని, ఈ ప్రాంత ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ఎమ్మెల్యే సిద్ధమయ్యారని అన్నారు. మెడికల్ కాలేజీని వేరే ప్రాంతంలో నిర్మిస్తే తిరుగుబాటు తప్పదని, మల్లాపురంతో పాటు ఇతర గ్రామాల ప్రజలు గ్రామాల్లో తిరగనివ్వరని హెచ్చరించారు. ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని మెడికల్ కాలేజీని మల్లాపురంలో గ్రామంలో ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు.
దీక్షకు అనుమతి లేదు: ఎసిపి
మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం బిఆర్ఎస్ మండలాధ్యక్షుడు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు ఎలాంటి అనుమతి లేదని ఎసిపి శ్రీనివాస్నాయుడు తెలిపారు. అనుమతి లేకుండా దీక్ష చేయడం చట్ట రీత్యా నేరం కాబట్టి కర్రె వెంకటయ్యను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఎవరైనా అడ్డుకోవాలని ప్రయత్నిస్తే వారిపై కూడా కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. దీక్ష చేయాలనుకుంటే పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతి లేకుండా ఆమరణ దీక్షకు దిగిన బిఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.
అరెస్ట్కు నిరసనగా ధర్నా..
మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం దీక్షకు దిగిన కర్రె వెంకటయ్య అరెస్ట్కు నిరసనగా యాదగిరిగుట్ట పట్టణంలో బిఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగారు. కర్రె వెంకటయ్యను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ధర్నాకు దిగిన బిఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.