ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ నుంచి బిఆర్ఎస్ తరఫున తానొక్కడినే ఎంఎల్ఎగా గెలిచానని, ఇప్పుడు ఎన్నికలు పెడితే 12కు పన్నెండు సీట్లు బిఆర్ఎస్ గెలుస్తుందని జగదీష్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్కరిని కూడా గెలవనియ్యనని ఛాలెంజ్ చేశారు. నీళ్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అన్యాయం చేసిందని విమర్శించారు. తన ఆస్తులు…రేవంత్ రెడ్డి ఆస్తుల గురించి మీడియానే తన గ్రామం,రేవంత్ రెడ్డి గ్రామం వెళ్లి విచారణ చేయాలని చెప్పారు. పాలన చేతగాని రేవంత్ ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయనే రైతు భరోసా వేశారని చెప్పారు. 27 వేల కోట్లు తెలంగాణ రైతాంగానికి రేవంత్ రెడ్డి బాకీ ఉన్నారని తెలిపారు. మీది ప్లాట్ల దందా.. కమిషన్ల దందా అయితే…తమది నీళ్లు.. రైతు సంక్షేమ పంథా అంటూ కాంగ్రెస్ నేతలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎక్కడైనా చర్చకు సిద్ధమే అని స్పష్టం చేశారు. తాము ఇచ్చిన నోటిఫికేషన్లకు ఉద్యోగాలు తప్ప.. సొంతంగా ఒక్కటైనా ఇచ్చారా..?అని ప్రశ్నించారు. మోదీ చంద్రబాబు సపోర్టు ఉందని ఇష్టారీతిన మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు స్క్రిప్టును రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నాడని ధ్వజమెత్తారు. తెలంగాణ రైతులను మోసం చేసి ఎపికి నీళ్లిచ్చే కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. రేవంత్రెడ్డిలాగా గురుదక్షిణగా కృష్ణా, గోదావరి జలాలను అప్పగించలేదని, ఆయన చేస్తున్న దుర్మార్గం ప్రజలు గ్రహిస్తున్నారని మండిపడ్డారు. కెసిఆర్కు పేరొస్తుందని కాళేశ్వరాన్ని ఎండబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హయాంలో ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్తను అక్రమంగా అరెస్టు చేయించలేదని చెప్పారు. ఏడాదిన్నరగా కాంగ్రెస్ ప్రభుత్వం బాగోతం ప్రజలు గ్రహిస్తున్నారని అన్నారు. సిఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా విజ్ఞతతో మాట్లాడితే మంచిదని జగదీష్రెడ్డి హితవు పలికారు.