Sunday, June 29, 2025

మహా టీవీకి బిఆర్‌ఎస్ లీగల్ నోటీసులు

- Advertisement -
- Advertisement -

ఫోన్ టాపింగ్ అంశంలో భారత రాష్ట్ర సమితి అధినేత కెసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌పై దురుద్దేశపూర్వకంగా ఫేక్ వార్తలు ప్రసారం చేసిన మహా టీవీకి బిఆర్‌ఎస్ లీగల్ నోటీసులు జారీ చేసింది. బిఆర్‌ఎస్ నాయకత్వంతో పాటు కెటిఆర్‌పై జర్నలిజం ముసుగులో మహాటీవీ మేనేజ్‌మెంట్ వ్యక్తిగతంగా విషం చిమ్ముతుండడంతో పార్టీ ఈ నోటీసులు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొన్ని రోజుల నుంచి తప్పుడు థంబ్ నేయిల్స్‌తో మహాటీవీ వార్తలు ప్రసారం చేస్తున్నదని, ఈ విషయంలో పలుమార్లు పార్టీ విజ్ఞప్తులు చేసినా కూడా మహా టీవీ ఎడిటోరియల్ విధానంలో మార్పు రాలేదని పార్టీ తెలిపింది.బిఆర్‌ఎస్ పార్టీకి, నాయకులకు చెడ్డపేరు తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా రూపొందించిన అసత్య కథనాలను ప్రసారం చేయడాన్ని మహాటీవీ ఆపలేదని, ఫేక్‌న్యూస్‌లు, అసత్య ఆరోపణలను తమ యూట్యూబ్ ఛానెల్‌తో విస్తృతంగా ప్రచారం చేయడాన్ని కొనసాగించిందని పేర్కొంది.

తన యూట్యూబ్ ఛానెల్‌లో తప్పుడు థంబ్‌నెయిల్స్ పెట్టి బిఆర్‌ఎస్ నాయకులపై వ్యక్తిగత దూషణలు, అవమానకరమైన కథనాలను మహా టీవీ ప్రసారం చేసిందని తెలిపింది. బిఆర్‌ఎస్ నాయకులపై గతంలో అభ్యంతరమైన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేతలు, చట్టవ్యతిరేక ప్రసారాలు చేసిన యూట్యూబ్ ఛానెల్స్‌కు పార్టీ నోటీసులు ఇవ్వగా, కొన్నింటిలో కోర్టులు గట్టి హెచ్చరికలు జారీ చేశాయి. మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో బిఆర్‌ఎస్ వేసిన పరువు నష్టం దావా (రూ.100 కోట్లు)తో పాటు క్రిమినల్ డెఫమేషన్ కేసును విచారించిన కోర్టు ఆమెను మందలించిన విషయం తెలిసిందే. అంతేకాక ఎన్నికల సంఘం కూడా ఆమెకు హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వంలోని కొందరు నాయకులతో చేతులు కలిపిన మహాటీవీ, బిఆర్‌ఎస్ పార్టీ పైన, నేతల పైన అడ్డగోలుగా దుష్ప్రచారం చేయడం పట్ల స్పందిస్తూ శనివారం లీగల్ నోటీసులు పంపినట్లు పార్టీ తెలిపింది.

ఇప్పటికైనా మహాటీవీ తమ విధానాన్ని మార్చుకోకపోతే, కొండా సురేఖ కేసులో లాగే, పరువు నష్టం దావా, క్రిమినల్ డెఫమేషన్ చర్యలు తీసుకోవడాన్ని పార్టీ తప్పనిసరిగా భావిస్తోంది. వార్తా సంస్థగా మహా టీవీ బాధ్యతగా వ్యవహరించాలని, జర్నలిజాన్ని వ్యక్తిగత ఎజెండాలకు వేదికగా కాక, సమాజ ప్రయోజనాల కోసం వాడాలని భారత రాష్ట్ర సమితి విజ్ఞప్తి చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News