అమెరికాలోని డల్లాస్ నగరంలో జూన్ 1న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను తెలంగాణ భవన్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల, నాయకులు చందుతాళ్ల, రంగినేని అభిలాష్ రావు, పుట్ట విష్ణువర్థన్ రెడ్డి కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ బీఆర్ఎస్ రజతోత్సవ సభలను విదేశాల్లో ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అమెరికాలో జూన్ 1న తేదీన డల్లాస్లో సభ నిర్వహిస్తున్నామని, అమెరికాలో జరిగే సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారని వెల్లడించారు. డల్లాస్ నగరం అంటే కేసీఆర్కు ఇష్టం అని, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగే సభలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
డల్లాస్లో నిర్వహించే సభలో పాల్గొనేందుకు తెలంగాణ, తెలుగు ఎన్ఆర్ఐలు పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తున్నారని మహేష్ బిగాల తెలిపారు. అనంతరం మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ బిడ్డలు, తెలుగు వారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్న పదేళ్లలో అనేక అద్భుతాలు జరిగాయని, బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందన్నారు. ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ కనివినీ ఎరుగని రీతిలో జరిగిందని, ఎన్ఆర్ఐలుగా ఉండి ప్రపంచ వ్యాప్తంగా బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు చేయడానికి ముందుకు రావడం మంచి పరిణామం అన్నారు. జూన్ 1న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు డల్లాస్లో జరగబోతున్నాయని, డల్లాస్లో జరిగే కార్యక్రమంలో తెలంగాణ, తెలుగు ప్రజలు పాల్గొనాలని కోరారు. అమెరికాతో పాటు యూకె, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుగుతాయని తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు.