విద్యార్థులకు ఉచిత బస్ పాసులివ్వాలి
సిపిఐ, ఎఐఎస్ఎఫ్ డిమాండ్
మన తెలంగాణ / హైదరాబాద్ : సాధారణ ప్రజలు, విద్యార్థుల బస్ పాస్ చార్జీల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాస్ రావు, ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆర్టిసి సంస్థ సాధారణ ప్రజలు, విద్యార్థుల బస్ పాస్ చార్జీలు 20 శాతం పెంపు వల్ల పేద ప్రజలపై పెను భారం పడుతుందని తక్కలపల్లి శ్రీనివాస్ రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిసి బస్ పాస్ చార్జీలు పెంచి ఒక్కో ప్రయాణికుడిపై ప్రతి నెల రూ. 200 వందల నుంచి రూ. 300 భారం మోపిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్టిసి బస్సుల్లో పేద మధ్య తరగతి ప్రజలు మాత్రమే ప్రయాణిస్తారని వారికి రాయితీలను ఇవ్వాల్సింది పోయి వారిపై భారం పెంచేలా చార్జీలు పెంచారని విమర్శించారు. కార్పొరేట్లకు రాయితీలు ఇస్తూ ప్రజలపై చార్జీల భారం మోపుతున్నరని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు ఉచితంగా ఆర్టిసి బస్సుల్లో కోట్లాది మందికి రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పుకుంటూ ఆర్టిసిపై ఆధారపడి రోజు జీవన ప్రయాణం కొనసాగించే వారికి ఆర్థికభారంమోపుతూ చార్జీలు పెంచిందని అన్నారు. చార్జీల పెంపుపై ప్రభుత్వం, ఆర్టిసి సంస్థ పునరాలోచించాలని, పెంచిన చార్జీలను తగ్గించాలని, ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుండి ఆర్టిసిలో విద్యార్థులకు ఉచిత బస్ పాసులు ఇవ్వాలని శ్రీనివాస్ రావు, మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు.