న్యూఢిల్లీ : శాసనసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా ఆమోదించాలంటూ కోర్టులు వారిని నిర్దేశించవచ్చా అనే అంశంపై మంగళవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. దీనిపై అభిప్రాయాలు తెలియజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ విచారణను చేపట్టింది. వచ్చే మంగళవారం నాటికి దీనిపై స్పందన తెలియజేయాలని ఆదేశించింది. ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం మాత్రమే కాదని, మొత్తం దేశానికి సంబంధించిన విషయమని గమనించాలని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
శాసనసభలు ఆమోదించిన బిల్లులపై ఆయా రాష్ట్రాల గవర్నర్లు, రాష్ట్రపతి ఒక కాల వ్యవధి లోగా చర్యలు తీసుకోవాలని గత ఏప్రిల్లో సుప్రీం కోర్టు పేర్కొంది. దీనిపై స్పందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తనకు రాజ్యాంగం లోని 143(1) అధికరణం ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకొన్ని 14 కీలక ప్రశ్నలను అత్యున్నత న్యాయస్థానం ముందుంచారు. ప్రజా ప్రయోజనంతో ముడిపడి ఉన్న చట్టపరమైన అంశాలపై రాష్ట్రపతి సుప్రీం కోర్టు అభిప్రాయం తెలుసుకునేందుకు ఆ కోర్టు ముందు తన ప్రశ్నను ఉంచవచ్చని సుప్రీం కోర్టు దానిపై విచారణ జరిపి తన అభిప్రాయాన్ని రాష్ట్రపతికి తెలియజేయవచ్చని 143(1) అధికరణం తెలియజేస్తోంది.