Sunday, June 1, 2025

ప్రగతికి కులవ్యవస్థే అడ్డుగోడ

- Advertisement -
- Advertisement -

‘ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి ఎక్కడైతే కొన్ని హక్కులు అనుభవిస్తున్నారో అక్కడి నుంచి వారిని తొలగించే ప్రయత్నం జరుగుతున్నది. అందులో భాగంగానే పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. దీనిని కేవలం ప్రైవేటైజేషన్ అనుకోవద్దు. ఇది డీ దళత్ ఫికేషన్, డీ ఒబిసి ఫికేషన్ అనాలి. ఎందుకంటే ఆయా వర్గాలను అవకాశాల నుంచి దూరం చేస్తున్నారు” అని కాంగ్రెస్ లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, రాహుల్ గాంధీ తన అభ్రిపాయాన్ని వెల్లడించారు. గత నాలుగు రోజుల క్రితం ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్ధులతో అదే క్యాంపస్‌లో కలుసుకొని మాట్లాడుతూ, “మీరు ప్రతి చోటా భాగస్వామ్యం గురించి, అవకాశాల గురించి మాట్లాడుతున్నారు. వాటిని కల్పించే అధికారం గురించి మాట్లాడాలి. కేవలం అవకాశాల గురించి ఆలోచిస్తే ప్రయాజనం లేదు. ఉదాహరణకు విద్యార్థులుగా ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిలు చాలా మంది ఉన్నారు. కానీ ఫ్రొఫెసర్లలో ఎవ్వరూ లేరని మీరే చెబుతున్నారు. అటువంటిప్పడు మీరు సరైన మార్గదర్శకత్వం పొందలేరు” అని తన సమాధానంలో రాహుల్ చెప్పారు.

ఈ సంభాషణ ఇప్పుడు చాలా చోట్ల చర్చనీయాంశంగా మారింది. అదే విధంగా మరొక విషయాన్ని రాహుల్‌గాంధీ, ప్రత్యేకంగా పేర్కొన్నారు. దేశంలో ఆర్థిక వనరులున్న రంగాలు ముఖ్యంగా కార్పొరేట్లు, కాంట్రాక్టు పనుల కేవలం కొన్ని సెక్షన్ల చేతుల్లో ఉన్నాయని, ఈ విషయం లెక్కలతో సహా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో తేలిందని కూడా ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేర్కోన్నట్లు ఎస్‌సి, ఎస్‌టి ఒబిసిలకు అవకాశాలను అందకుండా చేయడం, నిర్ణయాధికారం కలిగిన పదవుల్లో, హోదాల్లో వారికి స్థానం కల్పించకపోవడం వల్ల ఈ వర్గాలు రోజురోజుకు ఇంకా ఇంకా దిగజారిపోతున్నాయి. ఇది వాస్తవం. ముఖ్యంగా జ్ఞానానికి, ఆర్థిక రాజకీయ అధికారానికి దూరంగా ఉంచే ప్రక్రియ గత రెండు వేల ఏళ్ళుగా కొనసాగుతున్నది. భారతదేశ చరిత్రను మనం చాలా సూక్ష్మదృష్టితో పరిశీలిస్తే ఈ విషయాలు మనం అర్థం కాగలవు.

అధికారంలో ఏ పార్టీ ఉన్నా రాజ్యం ఏలుతున్నది కుల వ్యవస్థ రక్షకులు మాత్రమే. తాము ఏ స్థానంలో ఉన్నామో ఆ స్థానాలనకు ప్రమాదం వాటిల్లకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మనువాదం అనేది నాటికి, నేటికీ ఆధిపత్యంలోనే ఉన్నది. కొంత మంది మేధావులు మనుధర్మాన్ని మానవ ధర్మంలో రాజనీతి, ఆర్థిక శాస్త్రంగా పేర్కొంటూ, దానిని విమర్శించిన వాళ్ళ మీద మూకుమ్మడి దాడులు చేస్తున్నారు. కొన్ని సార్లు భౌతికంగా కూడా దాడులకు పాల్పడుతున్నారు. అయితే ఇప్పుడు ఆర్థిక వనరులకు, జ్ఞాన సముపార్జనకు, రాజకీయ హక్కుగా అవకాశం కల్పిస్తున్న భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. మనుధర్మంలో ఆ రోజు అంటరాని కులంగా చెప్పుకున్న చంఢాల జాతికి పెట్టిన ఆంక్షలను పరిశీలిస్తే మనకు ఈ కుల వ్యవస్థ వేదాలు ప్రబోధించే వర్ణవ్యవస్థ ఈనాటికి మరొక రూపంలో ఉనికిలోనే ఉన్నది.

‘చంఢాల, స్వపక జాతులు ఊరి బయటనే ఉండాలి. చనిపోయిన జంతువుల మాంసాన్నే తినాలి. శవాల మీద వస్త్రాల ధరించాలి. వీరిని ఎవరూ తాకకూడదు. ఎటువంటి ఇళ్ళు, జాగా ఉండడానికి లేదు. శ్మశానాలలోనే నివసించాలి” ఇది చాలా స్పష్టంగా మనుస్మృతిలో పేర్కొన్నారు. అంటే ఒక రకంగా వీరికి ఎటువంటి జ్ఞానం, వనరులు ఉండడానికి వీలు లేదు. శూద్రులు విషయానికొస్తే, వీళ్ళు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలకు సేవ చేయడమే వీరి పరమావధి. చదువు, ఇతర విశ్వ విజ్ఞానం వీరు నేర్చుకోకూడదు. వీరికి ఎవ్వరూ బోధించకూడదు. ఇందులో వృత్తి పని వారి సేవలుంటాయి. వారి శ్రమతో మిగతా మూడు కులాలను సేవించాలి. నైపుణ్యం కలిగిన వృత్తి పని వారు ఉన్నప్పటికీ, వాటి ఆదాయ వనరుల మీద వారికి అంతగా హక్కులుండవు. అదే నేటికీ కొనసాగుతున్నది. ముఖ్యంగా భూమి, ఆర్థిక వనరులు వీరికి అందాల్సిన స్థాయిలో అందడం లేదు.

ముఖ్యంగా దళితుల విషయానికొస్తే, పురాతన కాలం నుంచి ఎన్నో నిషేధాలు, ఆంక్షలు ఎదుర్కొనప్పటికీ, వాటిని అధిగమించి జీవిస్తూ ఈ సమాజాభివృద్ధికి పాటు పడుతూనే ఉన్నారు. భూమిని సాగు యోగ్యంగా చేసి, నీటి వనరులను సృష్టించి, వాటిని నిర్వహించి వ్యవసాయానికి తమ రక్తాన్ని, చెమటను అందించిన దళితులు ఇప్పటికీ భూమిని హక్కుగా పొందలేకపోతున్నారు. ఇప్పటికే ఉన్న భూములను కోల్పోతున్నారు. అంతేకాకుండా సమాజంలో సమాన హక్కులు ఉండాలని ఎన్నో ఏళ్లు ఎంతో మంది పోరాడి ఒక మార్గానికివస్తే ఆ హక్కు అందుకుందామంటే, అవి నిరుపయోగంగా ఉన్నాయి. రాహుల్ గాంధీ చెప్పినట్టు ఎస్‌సి, ఎస్‌టి, బిసిలు ఏ అవకాశాలను అందుకుందామని వస్తే అవి నిరుపయోగం అవుతున్నాయి. కొన్నికులాలు వీళ్లతో భాగస్వామ్యం పంచుకోలేక మరో ప్రపంచాన్ని సృష్టించుకుంటున్నారు. ఉదాహరణకు, 1950 రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత చట్టపరంగా అందరికీ ఒకే బడిలో చదువుకునే అవకాశం వచ్చింది. అయితే అది ఎంతో కాలం సాగలేదు. ఇరవై సంవత్సరాలు దాటిన తర్వాత ప్రభుత్వం నిర్వహించే పాఠశాలలు, కళాశాలల నుంచి వెళ్లిపోయి తమ కోసమేనన్నట్టుగా ప్రైవేటు విద్యా వ్యవస్థలను నెలకొల్పుకున్నారు.

సర్కారు విద్యా సంస్థల్లో ఎస్‌సి, ఎస్‌టి, కొన్ని బిసి కులాల పిల్లలకు పరిమితమయ్యాయి. ఒకనాడు విశ్వవిద్యాలయాలు అన్ని కులాల విద్యార్థులు చదువుకునేవారు. ఇప్పుడు ప్రభుత్వం నిర్వహిస్తున్న విశ్వవిద్యాలయాలు ఎస్‌సి, ఎస్‌టి, కొన్ని బిసి కులాలకే పరిమితం. సర్కారు విశ్వ విద్యాలయాలు నిధులు, సిబ్బంది, ఆధునిక వసతులు ఉండవు. ఆధిపత్య కులాలు చదువుకునే ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో అత్యాధునిక వసతులు ఉంటాయి. అదే విధంగా స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో అందరూ ప్రభుత్వ వైద్యశాలలకు వెళ్లేవారు. అప్పుడు అవి సమర్థవంతంగా పని చేసేవి. అక్కడికి కింద కులాలవాళ్లు, తక్కువ కులాల వాళ్లు రావడం మొదలై వాళ్లు పడుకునే మంచాల మీద తాము పడుకోవడం నీచమని భావించి ప్రైవేటు వైద్య వ్యవస్థను తీసుకొచ్చారు. దానితో ప్రభుత్వ వైద్యశాలలు పనికి రాకుండా పోయాయి. ఈగలు, దోమలు, పనికిరాని పరికరాలు, పని చేయని వైద్యుల స్థావరాలుగా మారిపోయాయి. అదే విధంగా పబ్లిక్ రంగ సంస్థలు. ఎంతో కొంత చదువుకొని ఉద్యోగాలకు వస్తే 1970 ప్రాంతం వరకు అన్ని ప్రైవేటు పరిశ్రమలే.

1970 తర్వాత అప్పటి ప్రధాన మంత్రి చాలా రంగాల్లో పబ్లిక్ రంగ సంస్థలను నెలకొల్పింది. అందులో రిజర్వేషన్లు ఉండడం వల్ల ఎస్‌సి, ఎస్‌టిలు ఉద్యోగాలు పొందారు. కాని ఆ సంబరం ఎక్కువ కాలం లేదు. 1970 తర్వాత ఆర్థిక సంక్షోభం పేరు చెప్పి ప్రైవేటు రంగానికి గేట్లు తెరిచారు. 2000 సంవత్సరం తర్వాత పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడం వేగం పెంచారు. ఇప్పుడు అది మొత్తం పబ్లిక్ రంగ సంస్థ అనే పదం లేకుండా చేస్తునానరు. దీనితో తేలేదేమిటంటే, కుల వ్యవస్థ ప్రతిపాదించిన నిచ్చెన మెట్ల వ్యవస్థ అదే గ్రేడింగ్‌ను కొనసాగిస్తున్నది. సమాజంలో ఉన్న చట్టాలు, రాజ్యాంగ హక్కులు అన్ని కుల వ్యవస్థ శక్తి ముందు, మనుస్మృతి ప్రభావం ముందు దూదిపింజల్లా తేలిపోతున్నాయి. అందుకే బాబాసాహెబ్ అంబేడ్కర్ చెప్పినట్టు ఈ దేశంలో కుల వ్యవస్థను నిర్మూలించకుండా ఎటువంటి ప్రగతి అనుకున్న స్థాయిలో సాధించలేమని తేలుతున్నది.

-మల్లేపల్లి లక్ష్మయ్య ( దర్పణం)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News