సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి జయంత్ చౌదరి సూచన
ఐటీఐలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని విజ్ఞప్తి
స్కిల్ యూనివర్సిటీకి మద్ధతు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరిన సీఎం
ఐటీఐల సిలబస్ అప్గ్రేడ్కు కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో వీఎఫ్ఎక్స్, గేమింగ్, ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంట్ ఆఫ్ ఎక్స్లెన్స్ను ఏర్పాటు చేయాల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరి సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో కేంద్ర మంత్రి జయంత్ చౌదరి ఆదివారం సమావేశమయ్యారు. ఐటీఐ విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి ఈసెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
తాము ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో సెంట్ ఆఫ్ ఎక్స్లెన్స్ను ఏర్పాటు చేసి దానిని ఐటీఐలకు అనుసంధానిస్తామని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంపై ముఖ్యమంత్రిని కేంద్ర మంత్రి అభినందించారు. జాతీయ నైపుణ్య శిక్షణ కింద యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి మద్ధతు ఇవ్వాలని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఐటీఐలన్నింటికీ ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని కేంద్ర మంత్రి సీఎంను కోరారు.
ఐటీఐల్లో సోలార్ విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సీఎం వెంటనే అధికారులను ఆదేశించారు. ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగినట్లు కాలానుగుణంగా ఐటీఐల్లో సిలడస్ను అప్గ్రేడ్ చేయాలని, ఇందుకోసం ప్రత్యేక కమిటీ నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ముఖ్య్మంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, సీఎంవో పరిశ్రమలు, పెట్టుబడుల విభాగం సీఈవో జయేష్ రంజన్ , పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి, కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులు పాల్గొన్నారు.