న్యూఢిల్లీ: రగ్బీ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ప్రారంభ సీజన్ విజేతగా చెన్నై బుల్స్ నిలిచింది. దీంతో రగ్బీ ప్రీమియర్ లీగ్ తొలి టైటిల్ ను సొంతం చేసుకున్న జట్టుగా చెన్నై బుల్స్ చరిత్ర సృష్టించింది. ఆదివారం ముంబైలోని షాహాజీ రాజే భోసలే స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగిన ఫైనల్లో చెన్నై బుల్స్ ఢిల్లీ రెడ్జ్తో తలపడింది. టోర్నీ ఆరంభం నుంచి ఆధిపత్య ప్రదర్శనతో చెలరేగిన చెన్నై బుల్స్.. ఫైనల్ మ్యాచ్ లోనూ అదరగొట్టింది. ఫైనల్లో ఢిల్లీ రెడ్జ్ను 41-0 స్కోరుతో మట్టికరిపించి..తొలి టైటిల్ ను కైవసం చేసుకుంది.
మూడో స్థానంలో హైదరాబాద్ హీరోస్
రగ్బీ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ లో హైదరాబాద్ హీరోస్ కూడా అద్భుత ప్రదర్శన చేసింది. టోర్నీ ప్రారంభంలో మొదటి స్థానంలో ఉన్న హైదరాబాద్ హీరోస్.. చివరికి మూడవ స్థానంలో నిలిచింది. బెంగళూరు బ్రేవ్హార్ట్స్ను ఓడించి మూడవ స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ లో తొలుత వెనకబడిన హైదరాబాద్ హీరోస్.. తర్వాత ఆ జట్టు అద్భుతంగా పుంజుకుని బెంగళూరును దెబ్బ కొట్టింది. 17-12 తేడాతో బ్రేవ్హార్ట్స్ను హీరోస్ ఓడించింది.