ఒక రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు, గత ప్రభుత్వపాలనాకాలంలో అమలు పరిచిన పథకాలకు సంబంధించిన రూపురేఖలు, అమలు పరిచే విధానాలు, పథకాల పేర్లు, వాటి ప్రాథాన్యతల్లో మార్పులు, చేర్పులు చోటుచేసుకోవడాన్ని ఎవరైనా అర్థం చేసుకోవాల్సిందే!గత పాలకుల కాలంలో అమలు జరిగిన పథకాల బాగోగులను సమీక్షించి, వాటిలోని లోపాలను సవరిస్తూ లేదా వాటి స్థానంలో సరికొత్త పథకాలను ప్రవేశపెట్టే ఆలోచనలను కూడా తప్పుపట్టలేం. కానీ మొత్తంగా ఆ వ్యవస్థనే బుద్ధిపూర్వకంగా విస్మరించేందుకు పూనుకునే కుటిలపూరిత వైఖరులను మాత్రం ఆ వ్యవస్థలో భాగస్వాములైన ప్రజల ముందు సమీక్షకు నిలపవలసి ఉంటుంది.
తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్ర ఉనికి కాలంలో దాదాపు ఆరు దశాబ్దాలపాటు పూర్తి నిర్లక్ష్యానికి, బుద్ధిపూర్వక అణచివేతకు గురైన మత్స్యరంగం ఇవాళ స్వంత రాష్ట్రంలో, ప్రజాప్రభుత్వ పాలనాకాలంలో కూడా అట్లాంటి దుస్థితిలోకి జారుకుంటున్న గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాదాపు ఆరువేలపై చిలుకు మత్స్య సహకార సంఘాలు, వాటిల్లో అధికారికంగా నమోదైన సుమారు నాలుగున్నర లక్షల మంది మత్స్యకారులు, ఈ మత్స్యకారుల కుటుంబాలకు చెందిన దాదాపు 20 లక్షల మంది ఈ రాష్ట్రప్రజలు స్వయానా ఈ రాష్ట్రప్రభుత్వం బుద్ధిపూర్వకంగా అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణుల ఫలితంగా అలమటించిపోతున్నారు. వారిని మరింతగా ఆందోళనకు గురిచేస్తున్న అంశమేమిటంటే..
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్వయానా నిర్వహిస్తున్నమత్స్యశాఖలోనే ఈ పరిస్థితులు నెలకొని ఉండటంవల్ల ఈ రంగంమీద ఆధారపడిన వృత్తికుల బహుజనులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక గడచిన ఏడాదిన్నర కాలంగా కుమిలిపోతున్నారు. గత ప్రభుత్వ పాలనా కాలంలో 2016 నుండి 2023 సంవత్సరాల మధ్య కాలంలో దాదాపు ఎనిమిది దశల్లో రాష్ట్రంలోని ఎంపిక చేసిన సుమారు 25 వేల పైచిలుకు చెరువులు, రిజర్వాయర్లు లాంటి నీటివనరుల్లో ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేసారు. ఇందుకోసం గత ఎనిమిది సంవత్సరాల కాలంలో సుమారు 573 కోట్ల రూపాయలను అప్పటి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు పరిచేందుకు ఖర్చు చేసింది. ఈ పథకం అమలులో అనేక రకాలైన అక్రమాలు, అవినీతికి సంబంధించిన ఆరోపణలు కూడా ఉన్నాయి. అందువల్ల ప్రభుత్వమే ఉచిత చేప పిల్లలను సేకరించి కాంట్రాక్టర్ల ద్వారా పంపిణీ చేయడం కంటే, అందుకు సంబంధించిన ఖర్చు మొత్తాలను నేరుగా సంబంధిత మత్స్యసహకార సంఘాలకు చెందిన బ్యాంకు ఖాతాలలో రైతు భరోసా పద్ధతిలో జమ చేయాలనే డిమాండు కూడా ఉన్నది.
ఈ పథకం మీద కాంగ్రెస్ పార్టీ గతంలో అనేక ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో కొత్తగా అధికారాన్ని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ పథకం అమలులో అవసరమైన సంస్కరణలు చేపట్టి కొత్త పద్ధతిలో నిర్వహిస్తుందని రాష్ట్రంలోని మత్స్యకారులు ఎదురుచూసారు. కానీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చీరాగానే ఈ పథకాన్ని మరింతగా నీరుగార్చే పద్ధతిలో అలక్ష్యం చేసింది. గతంలో అప్పటి ప్రభుత్వం పంపిణీ చేసిన ఉచిత చేపపిల్లల పంపిణీలో సగం శాతం మాత్రమే గత సంవత్సరం అమలు చేస్తామని తేల్చిచెప్పింది. 84 కోట్ల చేప పిల్లల పంపిణీ లక్ష్యంలో గత సంవత్సరం కేవలం 28 కోట్ల చేపపిల్లలను మాత్రమే పంపిణీ చేసినట్లు లెక్కలు చూపించి చేతులు దులుపుకున్నారు. గతంలో నిర్వహించిన రొయ్యపిల్లల పంపిణీని పూర్తిగానే రద్దు చేసారు.
కాంట్రాక్టర్లు ప్రభుత్వం మీది విశ్వాసంతో పంపిణీ చేసిన ఈ చేప పిల్లలకు సంబంధించిన సుమారు 34 కోట్ల రూపాయల బిల్లులను కూడా ఇంతవరకూ చెల్లించకపోవడంతో సదరు చేపపిల్లల పంపిణీదారులు లబోదిబోమంటున్నారు. దీనికితోడు ఈ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో, అంతకుముందటి ప్రభుత్వం నిర్దేశించిన రీతిలో పంపిణీ చేసిన చేపపిల్లలకు సంబంధించిన సుమారు 94 కోట్ల రూపాయలు కూడా ఈ ప్రభుత్వం ఇంతవరకూ చెల్లించలేదు. ఈ నెల 8వ తేదీనాడు రాష్ట్రంలో ప్రవేశించనున్న ‘మృగశిరకార్తె’ ఆరంభంతో చెరువుల్లో చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉండగా, ఈ పథకం అమలు విషయంలో ఇంతవరకూ మత్స్యశాఖ నుండి గానీ, ఆ శాఖను అంటిపెట్టుకున్న ముఖ్యమంత్రి నుండి గానీ ఎలాంటి స్పష్టమైన ప్రకటన ఇంతవరకూ రాలేదు.
గతంలో ఎనిమిది సంవత్సరాలపాటు నిరాటంకంగా అమలు జరిగన ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరం సగానికి కుదించుకుపోయి, ప్రస్తుత రెండో సంవత్సరంలో ఉలుకూపలుకూలేని స్థితిలో మత్స్యకారులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. రాష్ట్రంలోని చెరువుల్లోనూ, రిజర్వాయర్లలోనూ ఈ సంవత్సరం ప్రభుత్వం మత్స్యశాఖద్వారా ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తుందా! లేక తామే తమకు అవసరమైన చేపపిల్లలను స్వంత ఖర్చులతో సేకరించుకోవాలా? తేల్చుకోలేక రాష్ట్రంలోని మత్స్య సహకార సంఘాలు, వాటిల్లోని నాలుగున్నర లక్షల మంది మత్స్యకారులు ఒడ్డుకుపడిన చేప పిల్లల్లాగా తల్లడిల్లిపోతున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి 2014లో రాష్ట్రంలో సంవత్సరానికి చేపల ఉత్పత్తి సుమారు రెండున్నర లక్షల టన్నులుగా మాత్రమే నమోదైంది. అప్పటికే చేపల పెంపకానికి అనువుగా సుమారు ఆరు లక్షల హెక్టార్ల విస్తీర్ణం అందుబాటులో ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటుగా, దానికి అనుబంధంగా నిర్మించిన రిజర్వాయర్లు, నదీగర్భానికి సంబంధించిన నిలువ నీళ్లు (బ్యాక్ వాటర్స్) కలుపుకుని 2022 నాటికి రాష్టంలో చేపల పెంపకానికి అనువుగా అందుబాటులో ఉన్న నీటి విస్తీర్ణ సామర్థ్యం అధికారిక లెక్కల ప్రకారం దాదాపు ఏడున్నర లక్షల హెక్టార్లకు చేరుకున్నది. వార్షిక చేపల ఉత్పత్తి కూడా సుమారు నాలుగున్నర లక్షల టన్నులకు పెరిగింది. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల్లో పూడిక తీయడం, కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టులు, ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం అమలులాంటి పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో చెరువులు జలకళతోపాటుగా మత్స్యకారుల ఆర్థిక పరిపుష్టికి ఎంతగానో దోహదం చేసాయి.
నిజానికి అప్పటి ప్రభుత్వం మత్స్యరంగం అభివృద్ధి కంటే, సాగునీటి రంగాన్ని అభివృద్ధి పరచడంద్వారా వ్యవసాయ రంగాన్ని స్వయం సమృద్ధం చేయాలనే లక్ష్యానికే అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చినప్పటికీ, సాగునీటి, వ్యవసాయ రంగాలతోపాటుగా ఉపాంత ప్రయోజనంగా మత్స్యరంగానికి కూడా ఊతం లభించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో… చేపల పెంపకం విషయంలో తెలంగాణ రాష్ట్రం జాతీయ సగటు స్థాయిని చేరుకోవడానికి కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని అందరూ భావించారు. నీలివిప్లవం, ప్రధానమంత్రి మత్స్యసమృద్ధి యోజనలాంటి పథకాల అమలు నేపథ్యంలో మన దేశంలో ఒక హెక్టారు విస్తీర్ణంలో కనీసం మూడు టన్నుల చేపలను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ సగటును ఐదు టన్నులకు పెంచాలని కేంద్రప్రభుత్వం ప్రస్తుతం వివిధ పథకాల ద్వారా కృషి చేస్తున్నది. ఈ పద్ధతిలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి హెక్టారుకు కనీసం మూడు టన్నుల చేపలను పెంచగలిగినా, మన రాష్ట్రంలో చేపలపెంపకానికి అందుబాటులో ఉన్న ఏడున్నల లక్షల హెక్టార్ల విస్తీర్ణాన్ని ప్రణాళికాబద్ధంగా ఉపయోగించుకుంటే కనీసం 22 లక్షల టన్నుల చేపలను ఉత్పత్తి చేసేందుకు పూర్తి అవకాశాలున్నాయి.
ఇందుకు ‘తెలంగాణ స్టేట్ ఫిషరీస్ డెవెలప్మెంట్ కార్పోరేషన్’లాంటి నిర్మాణపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉన్నది. వాస్తవానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మత్స్యశాఖ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ‘ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ ఏర్పాటు చేస్తామని స్వయంగా రేవంత్ రెడ్డి అనేక మార్లు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో సైతం ఈ హామీని పొందుపరిచారు. స్వయంగా ఈ హామీ ఇచ్చిన రెవంత్ రెడ్డి ఇవాళ రాష్ట్ర మత్స్య మంత్రిత్వశాఖను సైతం నిర్వహిస్తున్నారు. అందువల్ల ఆయనే స్వయంగా ఇచ్చిన ‘ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ ఏర్పాటు హామీని నెరవేర్చడానికి ఎలాంటి ఆటంకాలుగానీ, ఇబ్బందులుగానీ, అడ్డంకులుగానీ లేవు. ఆయన తలచుకుంటే ఈ హామీ క్షణాల్లో అమలుచేసేందుకు అనువైన అవకాశాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ హామీని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడం వెనకకూడా పైన వివరించిన దీర్ఘకాలికమైన ప్రయోజనాలకు సంబంధించిన ప్రణాళికలు కాంగ్రెస్ పార్టీ ఆలోచనల్లో భాగంగా ఉన్నాయని కూడా ఈ రంగంమీ ఆసక్తి కలిగి ఉన్న ప్రతిఒక్కరూ భావించారు. కానీ సంవత్సరన్నర కాలంగా తెలంగాణ మత్స్యరంగంపట్ల ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణులు, అమలు పరుస్తున్న విధానాలు ఎవ్వరికీ, ఎలాంటి భరోసాను కల్పించడంలేదు.
పిట్టల రవీందర్
(తెలంగాణ ‘ఫిషరీస్ సొసైటీ’ వ్యవస్థాపక అధ్యక్షులు)