Monday, July 28, 2025

మళ్లీ వస్తున్న ‘అతడు’

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అతడు’ (Athadu)క్లాసిక్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ‘అతడు’ చిత్రం క్రేజ్ ఇప్పటికీ ఎప్పటికీ చెక్కు చెదరకుండా అలానే నిలిచింది. జయభేరి ఆర్ట్ బ్యానర్ మీద మురళీ మోహన్ నిర్మించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 9న రీ రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో శనివారం నాడు రీ రిలీజ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మురళీ మోహన్ మాట్లాడుతూ “మా బ్యానర్‌లో 2005 ఆగస్ట్ 10న అతడు సినిమాను రిలీజ్ చేశాం. ఇప్పుడు ఆగస్ట్ 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నాం. టెక్నాలజీ పరంగా అప్ గ్రేడ్ చేసి ఈ మూవీని మళ్లీ విడుదల చేస్తున్నాం. ఈ క్రమంలో మాకు ప్రసాద్ అండ్ టీం సహకరించింది.

రైటర్‌గా త్రివిక్రమ్ మంచి సక్సెస్‌లో ఉన్నప్పుడు మా బ్యానర్‌లో దర్శకుడిగా పరిచయం చేసి, ఆయనతో మొదటి సినిమా చేయాలని అనుకున్నాం. ఆ సమయంలో కథ చెప్పమని ఆయనను పిలిపించాం. స్రవంతి కిషోర్ కి మాటిచ్చాను.. వారి బ్యానర్‌లో సినిమా చేసిన తరువాత మీ వద్దకు వస్తానని త్రివిక్రమ్ అన్నారు. ఆ తరువాత మా వద్దకు వచ్చి మూడు గంటల పాటుగా ఈ ‘అతడు’ కథను కళ్లకు కట్టినట్టుగా (story eyes) చెప్పారు. హీరో అంటే సుగుణాభిరాముడు అని అంతా అనుకునేలా పాత చిత్రాలు వస్తుండేవి. కానీ ఇందులో హీరో పాత్ర కాస్త నెగెటివ్ ధోరణిలో ఉంది కదా? అని అంటే.. ఇప్పుడు అదే ట్రెండ్ అని త్రివిక్రమ్ అన్నారు. సరే అని అంతా ఆయన మీదే భారం వేశాం. ‘అతడు’ మూవీ కోసం మహేష్ బాబు చాలా సహకరించారు.

ఎంత ఆలస్యమైనా సరే, ఎన్ని డేట్లు అయినా సరే మహేష్ బాబు ఇచ్చారు. క్లైమాక్స్ ఫైట్ కోసం చాలా కష్టపడ్డారు. నా సోదరుడు కిషోర్ తనయ ప్రియాంక ఈ మూవీని టెక్నికల్‌గా అప్ గ్రేడ్ చేసి అందరి ముందుకు తీసుకు వస్తున్నారు. ఇక ముందు ప్రియాంక ఆధ్వర్యంలో జయ భేరి ఆర్ట్ నుంచి సినిమాలు వస్తూనే ఉంటాయి. రీ రిలీజ్ కోసం గత కొన్నేళ్ల నుంచి అందరూ నన్ను సంప్రదిస్తూ ఉన్నారు. జితేంద్ర వచ్చి అడిగిన తరువాత కాదనలేకపోయాను. ‘అతడు’ రీ రిలీజ్ బ్లాక్ బస్టర్ అవుతుందని కచ్చితంగా నమ్ముతున్నాను”అని అన్నారు. మహేష్ బాబు ఫౌండేషన్ ప్రతినిధి అన్వేష్ మాట్లాడుతూ.. “అతడు’ సినిమాను మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 9న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం.

ఈ రీ రిలీజ్‌ల ద్వారా ఎంత డబ్బు వచ్చినా సరే దాన్ని ఫౌండేషన్ కోసమే వాడుతున్నాం”అని తెలిపారు. జయభేరి ఆర్ట్ ప్రతినిధి ప్రియాంక దుగ్గిరాల మాట్లాడుతూ .. “అతడు’ మూవీని ఫిల్మ్‌లో తీశారు. ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకుని దాన్ని 8కె, సూపర్ 4కెలోకి మార్చాం. డాల్బీ సౌండ్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. క్లైమాక్స్ ఫైట్‌లో సౌండింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. మళ్లీ ఈ మూవీని థియేటర్లో చూస్తే పాత రోజులు గుర్తుకు వస్తాయి” అని పేర్కొన్నారు. ఎక్సెల్ బ్యానర్ ప్రతినిధి జితేంద్ర గుండపనేని మాట్లాడుతూ ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన చిత్రాల కంటే ‘అతడు’ ఎక్కువగా కలెక్షన్లను సాధిస్తుందని నమ్ముతున్నానని తెలియజేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News