జిల్లా కేంద్రంలోని రైల్వే జంక్షన్కి సమీపంలో నిర్మిస్తున్న నూతన కూనారం ఆర్ఓబి దగ్గర క్లస్టర్ విరిగిపోయింది. అయితే, ఈ క్లస్టర్ పూర్తిగా విరిగినా గడ్డర్లు రైలు పట్టాలపై పడకపోవడంతో పెద్దప్రమాదం తప్పినట్లయింది. క్లస్టర్ విరిగి నేపథ్యంలో రెండు గంటలపాఉట కాజీపేట నుండి బల్లార్ష, బల్లార్షా నుండి కాజీపేట ఇరు మార్గాల్లో నడిచే రైళ్లను రైల్వే అధికారులు ఆయా స్టేషన్లలో గంటల తరబడి నిలిపివేశారు. కొలనూర్ రైల్వేస్టేషన్లో అనువ్రత్ ఏసీ సూపర్ఫాస్ట్, పొత్కపల్లిలో ఏపి సూపర్ఫాస్ట్, బిజిగిర్షరీఫ్ రైల్వేస్టేషన్లో తమిళనాడు సూపర్ఫాస్ట్,
జమ్మికుంట రైల్వేస్టేషన్లో తెలంగాణ సూపర్ఫాస్ట్, బెంగళూరు రాజధాని సూపర్ఫాస్ట్, ఉప్పల్ రైల్వేస్టేషన్లో కాగజ్నగర్ ఇంటర్సిటీ, హసన్పర్తి రైల్వే స్టేషన్లో కోర్బా బై వీక్లీ సూపర్ఫాస్ట్, రామగుండం రైల్వేస్టేషన్లో వందే భారత్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లను గంటల తరబడి నిలిపారు. సిర్పూర్ వైపు వెళ్లే రామగిరి ఎక్స్ప్రెస్ పుష్పుల్ రైలును ఓదెల రైల్వేస్టేషన్లో నాలుగు గంటలపాటు నిలిపివేశారు. ఇరువైపులా రైళ్లు గంటల తరబడి నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఎట్టకేలకు సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టడంతో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.