Friday, April 19, 2024

ఫోటోలకు పోజులతో సరిపెట్టొద్దు

- Advertisement -
- Advertisement -

 Palle Pragathi

 

పల్లె ప్రగతిపై ఆకస్మిక తనిఖీలు చేస్తా

ప్రతి గ్రామంలో ప్రతి రోజూ పారిశుద్ధ్ద పనులు జరగాలి

కొందరు మంత్రులు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు తామే ఊడ్చినట్టు పేపర్లలో ఫోటోలకు పోజులిచ్చారు
ఇది సరైంది కాదు, గ్రామాల్లో ఎవరి పని వారి చేత చేయించాలి
అవసరమైన సిబ్బందిని నియమించాం, వేతనాలు పెంచాం
ప్రతి నెలా రూ. 339కోట్లు విడుదల చేస్తున్నాం
ట్రాక్టర్లున్నాయి, వాటిని ఉపయోగించేలా చూడాలి
మొక్కుబడి వ్యవహారం తగదు, పల్లె ప్రగతి బాటలోనే పట్టణ ప్రగతి చేపడతాం : ప్రగతి భవన్ సమీక్షలో సిఎం కెసిఆర్

హైదరాబాద్ : గ్రామాలు పచ్చదనంతో, పరిశుభ్రతతో వెల్లివిరియాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం మరింత పకడ్బందీగా జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆకాంక్షించారు. ప్రతి రోజు ప్రతీ గ్రామంలో పారిశుధ్య పనులు జరగాలన్నారు. గ్రామాలు బాగుండడం కోసం పారిశుద్ధ పనులు నిరంతరం జరిగి తీరాలని సిఎం అన్నారు.
పల్లె ప్రగతి కార్యక్రమం ఎలా అమలవుతున్నది… అధికారులు, ప్రజాప్రతినిధులు తమ పరిధిలో విధులు ఎలా నిర్వహిస్తున్నారు… అనే విషయాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు త్వరలో తానే గ్రామాల్లో ఆకస్మిక పర్యటనలు జరుపుతానని సిఎం అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిథులు ఫోటోలకు ఫోజులిచ్చే కార్యక్రమం కాకుండా చిత్తశుద్ధితో పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచే పనులు చేయించాలని కోరారు. పల్లె ప్రగతి స్పూర్తితో త్వరలో పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభించనున్నట్లు సిఎం వెల్లడించారు.

పల్లె ప్రగతి పురోగతిపై సిఎం కెసిఆర్ ఆదివారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ తివారి, పంచాయతీ రాజ్ కమిషనర్ రఘునందన్ రావు, పిసిసిఎఫ్ శోభ, సిఎంఒ కార్యదర్శి స్మితా సభర్వాల్, ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, ఒఎస్‌డి ప్రియాంక వర్గీస్ తదితరులు పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి సిఎం మాట్లాడుతూ, ప్రజలు అయితే పల్లెల్లో, లేకుంటే పట్టణాల్లో నివసిస్తారన్నారు. ఈ రెండు చోట్లు బాగుంటే రాష్ట్రమంతా బాగున్నట్టేనన్నారు. అందుకే పల్లెలు, పట్టణాలు బాగుండాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు.

ఇందులో భాగంగానే ముందుగా పల్లెప్రగతి కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. పంచాయతీ రాజ్ శాఖలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయడంతో పాటు ప్రతి గ్రామానికి గ్రామ కార్యదర్శిని నియమించామని సిఎం తెలిపారు. పంచాయతీ సిబ్బంది వేతనాలు కూడా పెంచామన్నారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా రూ.339 కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తున్నామని, ప్రతి గ్రామానికి ట్రాక్టర్ సమకూరుస్తున్నామన్నారు. ప్రభుత్వం ఇన్ని రకాల సహకారం, ప్రేరణ అందిస్తున్నప్పటికీ పల్లెలు బాగుపడకుంటే ఎట్ల? ఖచ్చితంగా బాగుపడి తీరాలని ఆదేశించారు. ప్రతి గ్రామానికి నర్సరీ ఏర్పాటు చేశాం. విధిగా అన్ని చోట్ల మొక్కలు పెంచాలి. గ్రామాన్ని శుభ్రంగా ఉంచడానికి రోజు వీధులు ఊడ్చాలి. మోరీలు శుభ్రం చేయాలి. కొన్ని రోజులు చేసి చేతులు దులుపుకోవడం కాదు. ప్రతీ రోజు గ్రామాల్లో ఏం జరగాలో అవన్నీ జరగాలి” అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

ఫోటో ఫోజులు వద్దు
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా కొందరు మంత్రులు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు తామే గ్రామాన్ని ఊడ్చినట్లు పేపర్లో ప్రచారం కోసం ఫోటోలకు ఫోజులు ఇచ్చారని, ఇది సరైంది కాదని సిఎం కెసిఆర్ అన్నారు. వారంతా ఉన్నది చీపిరి పట్టి ఊడ్వడానికి కాదు. గ్రామాల్లో ఎవరి పని వారితో చేపించడానికన్నారు. గ్రామ పంచాయతీల్లో అవసరమైన సిబ్బందిని నియమించాం… వేతనాలు పెంచాం. ట్రాక్టర్లున్నాయి….. వాటిని ఉపయోగించి పని చేయించాలని సూచించారు. అంతే తప్ప మొక్కుబడి వ్యవహారం కావద్దని స్పష్టం చేశారు.

ఆకస్మిక పర్యటనలు చేస్తా…
గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పనులు ఎలా జరుగుతున్నాయి? పల్లె ప్రగతి పురోగతి ఏమిటి? ఎవరెవరు తమ బాధ్యతలు సరిగ్గా నిర్వహిస్తున్నారు? అనే విషయాలు పరిశీలించడానికి తానే స్వయంగా త్వరలో గ్రామాల్లో ఆకస్మిక పర్యటనలు చేస్తానని సిఎం స్పష్టం చేశారు.

పల్లె ప్రగతిలో జరిగిన కార్యక్రమాలు
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో జరిగిన పనులను సమావేశంలో సిఎంకు అధికారులు వివరించారు. – 12,751 గ్రామాలకు గాను 12,705 గ్రామాల్లో నర్సరీల ఏర్పాటు జరిగిందని వివరించారు. – ఇప్పటి వరకు 6,017 ట్రాక్టర్ల కొనుగోలు చేశామన్నారు. మరో 4,534 ట్రాక్టర్లకు ఆర్డర్ ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు గ్రామాల్లో 10.78 కోట్ల మొక్కలు నాటడం జరిగిందన్నారు. వాటిలో 84 శాతం మొక్కలు బతికాయని సిఎంకు వివరించారు. 76,562 కిలోమీటర్ల మేర వీధులను శుభ్రం చేయడం జరిగిందన్నారు. – 62,976 కిలోమీటర్ల మేర మురికి కాల్వలను శుభ్రం చేయడంతో పాటు 48,767 చోట్ల పాత ఇండ్ల శిథిలాలను తొలగించామన్నారు.

1,24,655 చోట్ల పొదలు, తుప్పలు, మురికి తుమ్మలను తొలగించడం జరిగిందన్నారు. – 56,213 చోట్ల ఖాళీ ప్రదేశాలు, కామన్ ఏరియాలను శుభ్రం చేయడం జరిగిందన్నారు. -9,954 పనిచేయని పాత బోర్లను మూసివేయడం,- 1,13,881 చోట్ల నీరు నిల్వ ఉండే బొందలను పూడ్చివేయడం జరిగిందని వివరించారు. -56,050 చోట్ల రోడ్ల గుంతలను పూడ్చడం, 67,245 చోట్ల ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలను శుభ్రం చేయడం జరిగిందన్నారు. -మార్కెట్లు, సంతలు నిర్వహించే 6,500 ప్రదేశాలను శుభ్రం చేయడం జరిగిందని అధికారులు కెసిఆర్‌కు వివరించారు.

కాలుష్య కూపాలుగా మారకుండా చర్యలు తీసుకోండి
హైదరాబాద్ నగరంతో పాటు, ఇతర నగరాలు, పట్టణాలు కాలుష్య కూపాలుగా మారకుండా పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకోవాలని సిఎం కెసిఆర్‌అధికారులను ఆదేశించారు. నగరాల లోపల, బయట ఉన్న అటవీ భూముల్లో విరివిగా చెట్లు పెంచి, దట్టమైన అడవులు ఉండేలా చూడాలని సిఎం కోరారు. “హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తున్నది. నగరంలో జనాభా అంతకంతకూ పెరుగుతున్నది. మనది సముద్ర తీరం లేని నగరం. కాలుష్యం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నిర్లక్ష్యం చేస్తే ఇతర నగరాల మాదిరిగా జనజీవనం నరకప్రాయం అవుతుందన్నారు. దీనికి విరుగుడుగా పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలని సిఎం సూచించారు.

హైదరాబాద్ లోపల, బయట లక్షా 60 వేల ఎకరాల అటవీ భూమి ఉందని, వీటిలో విరివిగా చెట్లు పెంచాలన్నారు. దట్టమైన అడవులుగా తీర్చిదిద్దాసన్నారు. దీనివల్ల హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు పెరగకుండా, కాలుష్యం పెరగకుండా చూడవచ్చు అని సిఎం అన్నారు. అంతే కాకుండా నగరంలో కూడా విరివిగా చెట్లు పెంచడంతో పాటు హెచ్‌ఎండిఎ, జిహెచ్‌ఎంసి బడ్జెట్లలో పదిశాతం నిధులను పచ్చదనం పెంచడానికి ఉపయోగించాలన్నారు. ఇతర నగరాలు, పట్టణాల్లో కూడా హరిత ప్రణాళిక రూపొందించాలన్నారు. అన్ని పట్టణాల్లో కనీసం వార్డుకొకటి చొప్పున నర్సరీలు ఏర్పాటు చేయడంతో పాటు తెలంగాణలోని అన్ని పట్టణాలు పచ్చదనంతో కళకళలాడే విధంగా పట్టణ ప్రగతిలో చర్యలు ప్రారంభించాలి అని సిఎం కోరారు.

CM KCR review on Palle Pragathi
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News