ఇండోర్: ఇండోర్ విమానాశ్రయ రోడ్డులో సోమవారం జరిగిన ప్రమాద ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన తొమ్మిది మంది పోలీసులను ఆయన సస్పెండ్ చేశారు. నిన్న రాత్రి విమానాశ్రయ రోడ్డులో వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు.. రోడ్డు పక్కన గుమిగూడిన కనీసం 15 మందిపైకి దూసుకెళ్లింది. కింద చిక్కుకున్న బైక్ను కొన్ని మీటర్ల దూరం ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, చాలా మంది గాయపడ్డారు. ఈ భయానక సంఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. రోడ్డు భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
ఈ ప్రమాదంపై స్పందించిన ముఖ్యమంత్రి దర్యాప్తుకు ఆదేశించారు. నిషేధం ఉన్నప్పటికీ రాత్రి 11 గంటలకు ముందు భారీ వాహనాన్ని నగర పరిధిలోకి ఎలా అనుమతించారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారిని సిఎం పరామర్శించారు. ఈ సంఘటనలో ప్రాణనష్టం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. తక్షణ సహాయం కింద మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు, గాయపడిన ప్రతి వ్యక్తికి రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా, గాయపడిన వారి వైద్య ఖర్చులన్నింటినీ ప్రభుత్వమే భరిస్తుందని సిఎం చెప్పారు.
బాధిత కుటుంబాలను పరామర్శించిన అనంతరం ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ అరవింద్ తివారీతో పాటు, ఎసిపి సురేష్ సింగ్, ఏఎస్ఐ ప్రేమ్ సింగ్, ఇన్ఛార్జి సుబేదార్ చంద్రేష్ మరవి, ఇన్స్పెక్టర్ దీపక్ యాదవ్ (సూపర్ కారిడార్ టు ఏరోడ్రోమ్ ఇన్ఛార్జ్), సంఘటన సమయంలో విధుల్లో ఉన్న నలుగురు కానిస్టేబుళ్లను సిఎం సస్పెండ్ చేశారు. అలాగే, సంఘటనపై వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టిన కానిస్టేబుళ్లు పంకజ్ యాదవ్, అనిల్ కొఠారితో పాటు ఒక ఆటో-రిక్షా డ్రైవర్ను సిఎం ప్రశంసించారు.