Monday, September 8, 2025

కారు దిగలేదు.. చెయ్యందుకోలేదు

- Advertisement -
- Advertisement -
  • అవి మర్యాదపూర్వక కండువాలే నియోజకవర్గాల అభివృద్ధి కోసమే సిఎంని కలిశాం
  • స్పీకర్‌కు ఇద్దరు ఫిరాయింపు ఎంఎల్‌ఎల సమాధానం
  • అదే బాటలో మిగతా శాసనసభ్యులు?
  • ముంచుకొస్తున్న గడువుతో టెన్షన్.. టెన్షన్
  • సిఎం రేవంత్‌తో తొమ్మిది మంది అత్యవసర భేటీ
  • సమాలోచనలు ఆందోళన వద్దు
  • న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచన?
  • కడియం గైర్హాజరు

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు స్పీకర్‌కు సూచించడం, మరోవైపు స్పీకర్ నుంచి నోటీసులు రావడంతో ఏమి చేద్దామన్న అంశంపై చర్చించేందుకు ఫిరాయింపు ఎమ్మెల్యేలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో అత్యవసరంగా సమావేశమయ్యారు. బీఆర్‌ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరగా, వీరిలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మినహా మిగతావారంతా సీఎంతో భేటీ అయ్యారు.

ఇలా ఉండగా తమ నియోజకవర్గానికి చెందిన అభివృద్ధి పనులపై చర్చించేందుకే ముఖ్యమంత్రిని కలిసిన ఏమ్మెల్యేలు చెప్పినప్పటికీ వారు మాత్రం తమకు స్పీకర్‌కు నుంచి అందిన నోటీసులపై చర్చించినట్లు సమాచారం. కాగా ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్ ఇచ్చిన నోటీసులకు వివరణ కూడా ఇచ్చారు. మిగతా వారు సీఎం తో చర్చించాక నిర్ణయం తీసుకోవాలని భావిస్తోన్నట్టు తెలిసింది. కాగా తాము పార్టీ ఫిరాయించలేదని, ఒక ఎమ్మెల్యేగా సీఎంను మర్యాద పూర్వకంగా కలిసినప్పుడు శాలువా కప్పారే తప్ప కాంగ్రెస్ కండువా కప్పుకోలేదన్నద్నది వీరి వాదన. ఇదే కోణంలో స్పీకర్‌కు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన ఎమ్మెల్యేల మాదిరిగా మిగతా వారు కూడా సమాధానం ఇవ్వాలని ఈ సందర్భంగా నిర్ణయించినట్లు సమాచారం.

వివిధ సమావేశాలకు వెళ్ళినప్పుడు వేర్వేరు పార్టీల కార్యకర్తలు ఉత్సాహంగా కండువా కప్పుతుంటారని, గుళ్ళు గోపురాలకు వెళ్ళినప్పుడు కూడా గౌరవపూర్వకంగా కండవా కప్పుతుంటారన్న అంశాన్నీ స్పీకర్‌కు సమర్పించే సమాధానంలో పేర్కొనాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇంకా ఈ విషయమై న్యాయ నిపుణులతో సలహా తీసుకోవాలని ముఖ్యమంత్రి వారికి సూచించినట్లు తెలిసింది. అయితే తమ పార్టీ ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్‌లో చేరినందున రాజ్యాంగంలోని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని బిఆర్‌ఎస్ నేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి పూర్తి ఆధారాలతో స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తే కనీసం వారికి నోటీసులు కూడా ఇవ్వలేదని బిఆర్‌ఎస్ తరఫు న్యాయవాది కోర్టులో వాదన వినిపించారు. అనర్హత పిటిషన్లపై వాదనలు విన్న సుప్రీం కోర్టు ఈ వ్యవహారంపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు సూచించింది.

ఎలా జాప్యం చేయవచ్చు..
పది మంది ఎమ్మెల్యేలు ఒకేసారి కాకుండా వేర్వేరుగా కాంగ్రెస్‌లో చేరారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కార్యాలయం నుంచి వచ్చిన నోటీసులకు ఈ నెల 2వ తేదీలోగా సమాధానం ఇవ్వాల్సి ఉండగా, తమకు ఈ గడువు సరిపోదని, మరో 10 రోజుల గడువు కావాలని ఎమ్మెల్యేలు కోరారు. స్పీకర్ నుంచి వచ్చిన నోటీసులకు సమాధానాలు వేర్వేరు తేదీల్లో అందజేయాలని భావించారు. స్పీకర్ వద్ద విచారణ ప్రారంభమైన తర్వాత ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది గడువు కోరాలని, ఇలా పది మంది ఎమ్మెల్యేల తరఫున విచారణ వేర్వేరు నెలల్లో ప్రారంభం కావడంతో, అంత తొందరగా తుది నిర్ణయం తీసుకోకుండా జాప్యం జరిగేందుకు అవకాశం ఉంటుందన్న ఆలోచన చేశారు. పైగా తాము ప్రజా సమస్యలపైనే ముఖ్యమంత్రిని కలిసామని, ఎమ్మెల్యేగా తమ హక్కు అని చెప్పేందుకు అవకాశం ఉందన్న వాదన బలంగా వినిపించినట్లయితే స్పీకర్ ఆ వాదనతో సంతృప్తి చెంది కేసు కొట్టి వేసేందుకు అవకాశం ఉంటుందన్న అంశంపై చర్చించారు.

సుప్రీం కోర్టు ఏం చెప్పబోతున్నారు?
మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు స్పీకర్‌కు సూచన చేసినందున, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించడం జరిగిందని, వారు మరో పది రోజుల గడువు కోరారని, విచారణ కూడా చేపట్టామని చెప్పేందుకు ఆస్కారం ఉందని వారు భావించినట్లు తెలిసింది.

సురేష్ రెడ్డి స్పీకర్‌గా ఉన్నప్పుడు..
ప్రస్తుత బిఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు కెఆర్ సురేష్ రెడ్డి లోగడ అంటే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో స్పీకర్‌గా ఉన్నప్పుడు ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్లపై సుదీర్ఘంగా విచారణ కొనసాగించి, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేందుకు ఒక రోజు ముందు ముగ్గురు ఎమ్మెల్యేలపై మాత్రమే అనర్హత వేటు వేసి, మిగతా ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించలేదని తేల్చడం గురించి కూడా ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన సమావేశంలో చర్చించినట్లు సమాచారం.

ఆందోళన వద్దన్న సిఎం రేవంత్
ఇదిలాఉండగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి భరోసా ఇచ్చినట్లు తెలిసింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం ముగిసిన అనంతరం వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తాము పార్టీ ఫిరాయించలేదని, బిఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నామని చెప్పారు. నియోజకవర్గాల్లోని సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి వీటిని త్వరితగతిన పరిష్కరించాలని కోరామని వారు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు పార్టీ అధినాయకత్వం అనుమతి పొందారా? అని ప్రశ్నించగా, ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రిని కలిసేందుకు కూడా అనుమతి తీసుకోవాలా? అని వారు ఎదురు ప్రశ్నించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కడియం శ్రీహరి మినహా మిగతా వారంతా ముఖ్యమంత్రిని కలిసారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేలు వీరేః
తెల్లం వెంకట్రావు (భద్రాచలం), 2) ప్రకాశ్ గౌడ్ (రాజేంద్ర నగర్), 3) బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల్), 4) మహిపాల్ రెడ్డి (పటాన్‌చెరు), 5) అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), 6) పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ), 7) సంజయ్ కుమార్ (జగిత్యాల), 8) కాలె యాదయ్య (చేవెళ్ళ), 9) దానం నాగేందర్ (ఖైరతాబాద్), 10) కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్‌పూర్).

Also Read: బిఆర్ఎస్‌లోనే ఉన్నాను… ఏ పార్టీ కండువా కప్పుకోలేదు: బండ్ల

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News