Friday, May 30, 2025

మోదీ చెల్లని రూపాయి.. రాహుల్ నాయకత్వం దేశానికి అవసరం : రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి (Modi) వీరతిలకం దిద్ది పంపిస్తే.. ఆయన యుద్ధం మధ్యలోనే యుద్ధం ఆపేశారని సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎద్దేవా చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తే.. మోదీ యుద్ధం ఆపేశారని ఆయన విమర్శించారు. యుద్ధం సమయంలో పాక్‌ సైన్యం 36 మందిని చంపితే కేంద్రం ఏం చేసిందని ప్రశ్నించారు. ట్రంప్ బెదిరించినప్పుడు అఖిల పక్షాన్ని ఎందుకు పిలిచి మాట్లాడలేదని అడిగారు. యుద్ధ విరమణతో 140 కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని ట్రంప్ కాళ్ల ముందు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ‘పివొకెని లాక్కోమన్నాం.. బలూచిస్థాన్‌ను విడగొట్టమన్నాం’.. కానీ పాక్ నుంచి బలూచిస్థాన్‌ను విడగొట్టే ధైర్యం లేదా అని ప్రశ్నించారు.

వేల కోట్ల కాంట్రాక్టులు కావాల్సిన వాళ్లకు ఇచ్చుకున్నారని సిఎం (Revanth Reddy) అన్నారు. యుద్ధంలో పాకిస్థాన్ ఎన్ని రఫేల్ విమానాలను కూల్చిందో లెక్క చెప్పాలని పేర్కొన్నారు. అసలు రఫేల్ విమానాలు ఎందుకు నేలకూలాయో చెప్పాలన్నారు. సైనికుల ఆత్మస్థైర్యాన్ని బిజెపి ప్రభుత్వం దెబ్బతీసిందని.. సైనికులకు అండగా నిలిచేందుకే జైహింద్ ర్యాలీ అని తెలిపారు. సొంత ఇళ్లు కూడా లేని నాయకుడు రాహుల్ గాంధీ అని అన్నారు. మోదీ (Modi) కాలం చెల్లిన రూపాయి.. రద్దయిన వెయ్యి నోటు అని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వం దేశానికి అవసరమన్నారు. రాహుల్ ప్రధానిగా ఉండి ఉంటే పాక్‌ను రెండు ముక్కలు చేసేవారని.. పివొకెను లాక్కునేవారని అన్నారు. మనమందరం కలిసి రాహుల్‌గాంధీని ప్రధాని చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ భారత్‌ను యుద్ధంలో గెలిపించలేరని.. రాహుల్ ప్రధాని అయితేనే పాక్‌, చైనాను ఓడించగలమని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News