తొమ్మిది మందికి రూ. కోటి చొప్పున చెక్కులు అందజేత
పురస్కార గ్రహీతల్లో అందెశ్రీ, జయరాజు, సుద్దాల అశోక్తేజ, ఎక్కా యాదగిరి, పాశం యాదగిరి
గూడ అంజయ్య, గద్దర్, బండి యాదగిరి, గోరటి వెంకన్న తరఫున పురస్కారం
అందుకున్న కుటుంబ సభ్యులు
మనతెలంగాణ /హైదరాబాద్: తెలంగాణ ప్రజాపోరాటానికి స్ఫూర్తిని అందించిన 9 మంది ప్రముఖులకు సిఎం రేవంత్రెడ్డి కోటి రూపాయల నగదును అందచేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం వారు చేసిన పోరాట స్ఫూర్తికి గుర్తుగా ఆయన ఈ
బహుమతిని అందించారు. గత సంవత్సరంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా తెలంగాణ ప్రజాపోరాటానికి స్ఫూర్తిని అందించిన ప్రముఖులకు ఈ నగదు బహుమతిని అందచేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే గత సంవత్సరం ఇచ్చిన హామీ నేపథ్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వారికి కోటి రూపాయల చెక్కును అందించి వారి సేవలను సిఎం రేవంత్ కొనియాడారు. అయితే వారి తరపున కొందరు వారి కుటుంబాలు ఈ చెక్కులను అందుకున్నాయి.
చెక్కులను అందుకున్న ప్రముఖుల వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రజా యుద్ధ నౌక
గద్దర్: ప్రజా యుద్ధ నౌక గద్దర్గా ప్రసిద్ధి చెందిన ప్రజా పోరాట యోధుడు. అసలు పేరు గుమ్మడి విట్టల్ రావు. కవి, గాయకుడిగా, కమ్యూనిస్ట్ విప్లవకారుడిగా, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడిగా ఆయన ప్రజల్లో చైతన్యం కలిగించారు. ఆయన రాసి పాడిన ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా’ పాత ఉద్యమ బావుటానై నిలిచింది. గద్దర్ 1949లో తెలంగాణలోని మెదక్ జిల్లాలోని తూప్రాన్లో జన్మించాడు.
‘ఊరు మనదిరా’ పాట 16 భాషల్లో అనువాదం
గూడ అంజయ్య: జానపద శైలిలో ప్రజా గీతాలను రచించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊతంగా నిలిచిన గేయ కవి. 1955లో ఆదిలాబాద్ జిల్లా, దండేపల్లి మండలం, లింగాపురం గ్రామంలో ఆయన జన్మించారు. నలభై ఏళ్లు కవిగా, రచయితగా ఎన్నో కథలు, పాటలు రాసిన అంజయ్య రచనల్లో ‘ఊరు మనదిరా’ అనే పాట 16 భాషల్లో అనువాదమయ్యింది.
‘జయ జయహే తెలంగాణ’ గీత రచయిత
అందెశ్రీ: వరంగల్ జిల్లా, జనగాం వద్ద గల రేబర్తి (మద్దూర్ మండలం) అనే గ్రామంలో ఆయన జన్మించారు. ఈయన అసలు పేరు అందె ఎల్లయ్య. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ఆయన గౌరవ డాక్టరేట్ పొందారు. తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ గీతాన్ని’ రచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయన పాటల ప్రసిద్ధి. తెలంగాణ, ప్రకృతి లాంటి అంశాలపై ఆయన గేయరచన చేశారు.
‘పల్లె కన్నీరు పెడుతోంది’
గోరటి వెంకన్న: ఆయన ప్రముఖ ప్రజా వాగ్గేయకారుడు. పల్లె ప్రజలు, ప్రకృతి ఆయన పాటలకు మూలాధారాలు. వల్లంకి తాళం పుస్తకానికి 2021లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. గోరటి వెంకన్న 1963లో నాగర్కర్నూల్ జిల్లా, గౌరారం (తెల్కపల్లి)లో ఆయన జన్మించారు. ‘జై భోలో జై భోలో అమరవీరులకు జై భోలో’ అనే పాట, అలాగే కుబుసం సినిమా కోసం ఆయన రాసిన ‘పల్లె కన్నీరు పెడుతోంది’ అనే పాట, పూసిన పున్నమి వెన్నెలలోన తెలంగాణ వీణ పాటలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
జాతీయ అవార్డు గ్రహీత
సుద్దాల అశోక్ తేజ: యాదాద్రి భువనగిరి జిల్లా, గుండాల మండలం, సుద్దాల గ్రామంలో ఈయన జన్మించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రముఖుడైన సుద్దాల హన్మంత్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న అశోక్ తేజ, సినీ రంగం వైపు దృష్టి మళ్లీంచారు. సుమారు 2,000లకు పైగా సినిమాల్లో 3,000 పైచిలుకు పాటలు రాశారు. 2003లో వచ్చిన ఠాగూర్ సినిమాలోని ‘నేను సైతం‘ పాటకు 2014లో జాతీయ గీత రచయిత అవార్డును ఆయన గెలుచుకున్నారు.
పేరుతెచ్చిన ‘వానమ్మ వానమ్మా..’ పాట
జయరాజు: ఈయన మహబూబాబాద్ జిల్లా, మహబూబాబాద్ మండలం, గుమ్మనూర్లో జన్మించారు. జయరాజు చదువంతా ఖమ్మం జిల్లా బయ్యారం మండలం గంధంపల్లిలో సాగింది. మహబూబాబాద్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చేస్తూ మధ్యలోనే ఆపి, కొత్తగూడెంలో ఐటీఐ పూర్తి చేశారు. డిగ్రీ పూర్తి చేయకముందే జయరాజు సింగరేణిలో పిట్టర్గా ఉద్యోగంలో చేరారు. జయరాజ్ ప్రకృతి మీద 122 కథలు, గేయాలతో రాసిన ‘అవని’ పుస్తకం హిందీ, ఇంగ్లీష్, కన్నడ సహా అనేక భాషల్లోకి అనువాదమై విస్తృత ప్రాచుర్యం పొందింది. వారు రాసిన పాటలలో ‘వానమ్మ వానమ్మా.. వానమ్మ.. ఒకసారైనా వచ్చిపోవే.. వానమ్మ..’ ప్రసిద్ధి చెందినవి.
ఉద్యమకారుడిగా ప్రత్యేక ముద్ర
పాశం యాదగిరి: తెలుగు పత్రికా రంగంలో పేరెన్నిక గన్న జర్నలిస్టు, మేధావి, సామాజిక తాత్వికుడు. హైదరాబాద్ గౌలిగూడలో 1952 సంవత్సరం మార్చి 15వ తేదీన ఆయన జన్మించారు. రాజకీయ విశ్లేషకుడిగా, పత్రికాధిపతిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా ప్రత్యేక ముద్ర ఆయనది.
ఖ్యాతి గడించిన శిల్పి
ఎక్కా యాదగిరిరావు: ఈయన అంతర్జాతీయ ఖ్యాతి గడించిన శిల్పి, చిత్రకారుడు. హైదరాబాద్ పాతబస్తీలోని అలియాబాద్లో జన్మించారు. తెలంగాణ అమరవీరుల స్మారకస్థూపం శిల్పి, పద్మశ్రీ అవార్డు గ్రహీత. భారతీయ శిల్పకళను పరిశోధించి లోహ ‘మిథున’ శిల్పాన్ని రూపొందిం చారు. ‘మిథున’ శిల్పం యాదగిరిరావుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అమితమైన గుర్తింపును తీసుకొచ్చింది.
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార విజేత
నలిమెల భాస్కర్: ఈయన కవి, రచయిత, అనువాదకుడు, బహుభాషావేత్త, వ్యాసకర్త, తెలంగాణ భాషపై పరిశోధన చేసిన భాషా నిపుణుడు. 1956 ఏప్రిల్ 1 న రాజన్న సిరిసిల్ల జిల్లా, యల్లారెడ్డిపేట్ మండలం, నారాయణపూర్ లో జన్మించారు. తెలుగు, కన్నడ, తమిళ, మళయాళ సామెతలపై ఉస్మానియా విశ్వవిద్యాల యంలో ఎంఫిల్ చేశారు. తెలంగాణ పదకోశాన్ని రూపొందించడమే కాకుండా పలు భారతీయ భాషల కథలను తెలుగులోకి అనువదించారు.